ఇసుక అక్రమ తవ్వకాలపై ఆకస్మిక దాడి
ABN , First Publish Date - 2020-06-03T11:34:28+05:30 IST
ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు నియమించిన ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది.
కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ ఏఏస్పీ గరుడ్ సుమిత్సునీల్
తుని, జూన్ 2: ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు నియమించిన ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. సమాచారం అందిన వెంటనే ఆకస్మిక దాడులు చేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున తొండంగి మండలం పంపాదిపేట వద్ద అక్రమంగా జరుపుతున్న ఇసుక తవ్వకాలపై ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆధ్వర్యంలో ఎస్ఐ గోపాలకృష్ణ, ఇతర అధికారులు కలిసి దాడులు చేసి ఆరు లారీలు, ఒక ఎక్స్కవేటర్ను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా సునీల్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ స్థానిక పోలీసులు ప్రమేయం లేకుండా సమాచారం అందిన వెంటనే తమ బృందం దాడులు జరిపి, అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు. ఇటీవల తాండవ నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను సీజ్ చేశామన్నారు. అక్రమ తవ్వకాలకు ఎవ్వరు పాల్పడినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే తమ విభాగానికి సమాచారం ఇవ్వాలని కోరారు.