మేడ పైనుంచి దూకేస్తానంటూ యువకుడి హల్చల్
ABN , First Publish Date - 2021-10-20T06:36:05+05:30 IST
మేడ పైనుంచి దూకేస్తానంటూ యువకుడి హల్చల్
నచ్చజెప్పి సురక్షితంగా కిందకి దింపిన పోలీసు, ఫైర్ సిబ్బంది
పాయకాపురం, అక్టోబరు 19: మూడు అంతస్థుల మేడపైకి ఎక్కి కిందకి దూకేస్తానంటూ పాయకాపురం రాజీవ్నగర్ ప్రాంతంలో మంగళవారం ఓ యువకుడు హల్చల్ చేశాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది చొరవతో అతన్ని సురక్షితంగా కిందకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. ఎం.శ్యామ్(19) ఓల్డ్ రాజీవ్నగర్లో నివాసం ఉంటున్నాడు. 12 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి బెంగుళూరులో స్థిరపడిపోయింది. అప్పటి నుంచి తండ్రి వద్దనే ఉంటున్నాడు. అయితే శ్యామ్కు మతిస్థిమితం సరిగ్గా లేక పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. కొన్ని రోజులుగా బెంగుళూరులోని తన తల్లి వద్దకు వెళ్తానంటూ ఇంట్లో గొడవ చేశాడు. పంపించడంలో జాప్యం జరుగుతుండటంతో సహనం కోల్పోయి మూడంతస్థుల మేడపై ఎక్కి దూకేస్తానంటూ గందరగోళం సృష్టించాడు. సమాచారం అందుకున్న పాయకాపురం ఫైర్ సిబ్బంది, నున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గంటపాటు యువకుడికి నచ్చజెప్పి, కిందకి దింపారు. ప్రమాదం తప్పడంతో బంధువులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.