నువ్వెవడ్రా.. పోరా!
ABN , First Publish Date - 2020-11-24T08:43:12+05:30 IST
‘‘నువ్వెవడివిరా.. పోరా! నీకు అన్నీ అయిపోయాయ్ కొడకా! కాకినాడపై నీ పెత్తనమేంట్రా? ఏం మాట్లాడుతున్నావ్..
కాకినాడ గురించి నీకెందుకు..కొడకా!
ఏం చేసుకుంటావో చేస్కో పో!
నీకు అన్నీ అయిపోయాయ్
అవినీతి జరిగితే నాకు చెప్పాలి
బోస్పై ఎమ్మెల్యే ద్వారంపూడి దూషణలు
ఇళ్లలో అవినీతిపై ప్రశ్నించడంతో ఆగ్రహం
‘నోర్ముయ్’ అంటూ చినరాజప్పపైనా దాడి
కాకినాడలో డీఆర్సీ వేదికగా విభేదాలు
‘అనంత’లో మంత్రి బొత్సకు అసమ్మతి సెగ
విశాఖలో రోడ్డుకెక్కిన వర్గపోరు
తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ నేత, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబో్సను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తిట్టిపోశారు. అనంతపురం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ వర్గీయులే అడ్డుకున్నారు. విశాఖలో కార్పొరేటర్ అభ్యర్థి, మాజీ డిప్యూటీ మేయర్ నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. వైసీపీలో ఒకేరోజు ఇలా నేతలు రచ్చకెక్కారు.
అమరావతి/కాకినాడ/అనంతపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘నువ్వెవడివిరా.. పోరా! నీకు అన్నీ అయిపోయాయ్ కొడకా! కాకినాడపై నీ పెత్తనమేంట్రా? ఏం మాట్లాడుతున్నావ్.. ఏం చేసుకుంటావో చేస్కో’’... ఇది సొంత పార్టీ రాజ్యసభ సభ్యుడు, బీసీ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభా్షచంద్రబో్సపై కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తిట్ల దండకం. సోమవారం కాకినాడలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా సమీక్ష (డీఆర్సీ) సమావేశంలో టిడ్కో ఇళ్ల అవినీతిపై ప్రశ్నించిన బోస్పై ద్వారంపూడి బూతులతో దండయాత్ర చేశారు. ఇదే సమావేశంలో మరో మాజీ ఉపముఖ్యమంత్రి, టీడీపీ నేత చినరాజప్పనూ దూషించారు. ‘నోర్ముయ్’ అంటూ రెచ్చిపోయారు. ద్వారంపూడి తీరుతో సమావేశంలో అధికార పార్టీ సభ్యులు సైతం నోరెళ్లబెట్టారు. సోమవారం ఉదయం జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన డీఆర్సీ భేటీ జరిగింది. ఇళ్ల నిర్మాణం అంశం చర్చకు వచ్చినప్పుడు బోస్ మాట్లాడుతూ.. కాకినాడ టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగిందని, లబ్ధిదారుల నుంచి కొందరు లక్షల్లో వసూలు చేశారని ఆరోపించారు.
తన సొంత బంధువులే ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారన్నారు. కాకినాడ మేడ లైన్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు పెరిగిపోయాయని, దీని వల్లే వర్షాలకు కాకినాడ నగరం మునిగిపోతోందని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా జిల్లావ్యాప్తంగా ఒక నేత మట్టిమాఫియా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో ఎమ్మెల్యే ద్వారంపూడి ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. పిల్లి సుభా్షపై బూతులతో విరుచుకుపడ్డారు. టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగితే ఆ జాబితా తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియా ఎక్కడా లేదన్నారు. బోస్ స్పందిస్తూ.. తాను కలెక్టర్కు లిస్ట్ ఇస్తానన్నారు. దీంతో.. మనం అధికారపక్షంలో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నామా అంటూ బోస్పై ద్వారంపూడి మండిపడ్డారు. టిడ్కో ఇళ్ల అవినీతి అంశంపై మంత్రి బొత్స కూడా తనకు ఫోన్ చేశారని.. కాకినాడకు సంబంధించి ఏదైనా ఉంటే తనకు చెప్పక్కర్లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీఆర్సీ సమావేశం ముగిసి అంతా బయటకు వెళ్తుండగా, ద్వారంపూడి మరోసారి బోస్పై విరుచుకుపడ్డారు. ‘‘టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగితే నాకు చెప్పాలి. నేనేం చచ్చిపోలేదు కదా!’’అని మండిపడ్డారు. ‘నీకు చెప్పవలసిన అవసరం లేదు’ అని బోస్ అనడంతో... ద్వారంపూడి మరింత రెచ్చిపోయారు. ‘ఏం చేసుకుంటావో చేసుకో! నీకు అన్నీ అయిపోయాయి’ అంటూ వేళ్లు చూపిస్తూ హెచ్చరించారు. దీంతో బోస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం మాట్లాడుతున్నావ్. వెళ్లు’ అంటూ కోప్పడ్డారు. దీంతో ద్వారంపూడి మరింత కోపంతో.. ‘‘కాకినాడ గురించి నీకెందుకు! ఈ నగరంపై నీ పెత్తనమేంటి’’ అంటూ ఒక బూతు వాడారు. ఒకానొక దశలో బోస్పై ఆయన దాడిచేస్తారేమో అన్న భయం అక్కడున్న నేతల్లో పెరిగింది. దీంతో వారంతా ద్వారంపూడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
చినరాజప్పపైనా...
అంతకుముందు.. డీఆర్సీ సమావేశంలో టిడ్కో ఇళ్ల అవినీతి గత ప్రభుత్వంలోనే జరిగిందని ద్వారంపూడి ఆవేశంగా ఆరోపించగా... టీడీపీ పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప జోక్యం చేసుకున్నారు. మీరూ మీరూ తిట్టుకుంటూ మధ్యలో టీడీపీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. దీంతో ‘నోర్ముయ్. నోరు మూసుకుని కూర్చో’ అంటూ ద్వారంపూడి ఆయనపైనా విరుచుకుపడ్డారు. అడ్డొచ్చిన టీడీపీ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల రాజేశ్వరరావును పక్కకు నెట్టేశారు.