సుభాష్ చంద్రబోస్.. దేశానికే ఐకాన్
ABN , First Publish Date - 2022-01-24T06:32:10+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ...
నేతాజీ త్యాగాలు దేశప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తే
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వ్యాఖ్యలు
బోస్ గొప్ప జాతీయవాది: ఉప రాష్ట్రపతి వెంకయ్య
నేతాజీ సేవలతో భారతీయులంతా గర్విస్తున్నారు
ఇండియాగేట్ వద్ద చంద్రబోస్ హోలోగ్రామ్ని
ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
దేశవ్యాప్తంగా నేతాజీ 125వ జయంతి వేడుకలు
నేతాజీ సేవలతో ప్రతి భారతీయుడూ గర్విస్తున్నాడు: మోదీ
న్యూఢిల్లీ, జనవరి 23: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో ఆదివారం ఈ వేడుకలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు నేతాజీకి ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర భారతావని సాధన దిశగా బోస్ వేసిన సాహసోపేత అడుగులు ఆయన్ను ‘దేశానికే ఐకాన్’గా నిలిపాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ గొప్ప జాతీయవాది, దూరదృష్టి కలిగిన నేత అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. ‘సుభాష్ చంద్రబో్సకు నమస్కరిస్తున్నా. దేశానికి ఆయన అందించిన సేవలకు ప్రతి భారతీయుడూ గర్విస్తున్నాడు’ అని మోదీ ట్వీట్ చేశారు. నేతాజీ జయంతిని కూడా వేడుకల్లో చేర్చుతూ.. కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ ఏడాది గణతంత్ర వేడుకలను జనవరి 23 నుంచే ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ‘నేతాజీ అవార్డ్ 2022’ను ప్రదానం చేశారు. కోల్కతాలోని జపాన్ కాన్సుల్ జనరల్ నకముర యుటాకా.. షింజో తరఫున పురస్కారాన్ని అందుకున్నారు. కాగా.. టోక్యోలోని ప్రఖ్యాత రెంకోజీ బౌద్ధాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబో్సదిగా చెబుతున్న చితాభస్మానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు ఆలయ పూజారి అంగీకారం తెలుపుతూ 2005లో భారత ప్రభుత్వానికి రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ అనుమతిని ముఖర్జీ కమిషన్ పట్టించుకోకపోవడం గమనార్హం.
బెంగాల్ అంటే ఎందుకంత అలర్జీ?
కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోందని, అదేసమయంలో గణతంత్ర వేడుకల్లో బెంగాల్ శకటాన్ని మాత్రం తిరస్కరించిందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దేశానికి నేతాజీ అందించిన విశేష సేవలను తెలియజేసేలా రూపొందించిన శకటాన్ని తిరస్కరించడం ద్వారా కేంద్రం బెంగాల్ పట్ల చూపుతున్న వివక్షను అర్థం చేసుకోవచ్చన్నారు. ఆదివారం కోల్కోతాలో నేతాజీ 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆమె కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బెంగాల్ అంటే ఎందుకంత అలర్జీ? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే నేతాజీ మృతి మిస్టరీని ఛేదిస్తామన్న బీజేపీ.. ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో నేతాజీదిగా చెబుతున్న చితాభస్మానికి డీఎన్ఏ పరీక్షలు కూడా చేయించలేదని ఆరోపించారు. ఆయనకు సంబంధించిన అన్ని పత్రాలను తాము అందుబాటులో ఉంచామని మమత చెప్పారు. నేతాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ప్రధాని మోదీని మమత కోరారు.