ఆటో ప్రమాదం: ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి మృతదేహాల తరలింపు
ABN , First Publish Date - 2022-06-30T16:37:05+05:30 IST
జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లి ఆటో ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శ్రీ సత్యసాయి: జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లి ఆటో ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో రాములమ్మ, రత్నమ్మ, పెద్ద కాంతమ్మ లక్ష్మీదేవి, కుమారి అక్కడికక్కడే మృతి చెందగా... మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోపై ఉన్న ఇనుప మంచానికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కూలీలతో వెళ్తున్న ఆటోపై ఒక్కసారిగా విద్యుత్ తీగలు తెగి పడటంతో మంటలు అంటుకున్నాయి. అక్కడికక్కడే అయిదుగురు సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పోతలయ్య మరో మహిళ కూలి రమాదేవి ఆటో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల బంధువులను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.