కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలి
ABN , First Publish Date - 2022-05-21T04:48:19+05:30 IST
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రికార్డుస్థాయిలో
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల, మే 20 : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రికార్డుస్థాయిలో నిరుద్యోగ యువతకు వరం ఇచ్చారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని ఫారా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్థానికులకే ఉద్యోగాలు లభించేలా జోనల్ వ్యవస్థ తీసుకువచ్చి నోటిఫికేషన్లు ఇస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తూనే నిరుద్యోగులు బయట కోచింగ్ సెంటర్ల వద్ద వేల రూపాయలు ఖర్చు చేసుకోకుండా రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలతో ఉచిత శిక్షణా తరగతులు ఏర్పాటు చేయిస్తున్నారని స్పష్టం చేశారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని యువతకు పిలుపునిచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలోని నిరుద్యోగుల కోసం ఉచిత శిక్షణ తరగతుల సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతం నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ 60 రోజుల పాటు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, జెడ్పీటీసీ ఎం. మాలతి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, సీనియర్ నాయకులు రమణారెడ్డి, నాగార్జున్రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్, రవీందర్ ఉన్నారు.