ఒమైక్రాన్ ఎందుకంత ప్రమాదకారి కాదు.. అధ్యయనం ఏం చెబుతోంది?

ABN , First Publish Date - 2022-01-02T22:36:11+05:30 IST

కరోనా మహమ్మారి తొలిసారి ఈ ప్రపంచంపై దండెత్తినప్పుడు జనం వణికిపోయారు. దేశాలన్నీ దాని గుప్పిట్లో

ఒమైక్రాన్ ఎందుకంత ప్రమాదకారి కాదు.. అధ్యయనం ఏం చెబుతోంది?

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తొలిసారి ఈ ప్రపంచంపై దండెత్తినప్పుడు జనం వణికిపోయారు. దేశాలన్నీ దాని గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడాయి. వైరస్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుండగానే రూపం మార్చుకుని ‘డెల్టా’గా వచ్చి దొంగదెబ్బ తీసింది. ఈసారి అది కలిగించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.


ఇక, మన దేశమైతే దాని దెబ్బకు చిగురుటాకులా వణికింది. శ్వాసను అందనివ్వకుండా చేసి వేలాది ప్రాణాలను బలితీసుకుంది. ఎలాగోలా దాని నుంచి కూడా తప్పించుకుని ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఈసారి ఒమైక్రాన్‌ రూపంలో వేషం వేసుకుని మరోమారు దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తోంది. 


దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కమ్మేసింది. భారత్‌లోనూ శరవేగంగా విస్తరిస్తోంది. రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నాటికి ఇది పతాకస్థాయికి చేరుకుని థర్డ్ వేవ్‌కు కారణమవుతుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. నిజానికి ఈ వేరియంట్ చూపే ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సహా ఎవరి వద్ద కచ్చితమైన సమాచారం లేదు. ఇది ప్రమాదకరమని కొందరంటే, అబ్బబ్బే.. అదేం లేదు అని మరికొందరు చెబుతున్నారు. అయితే, వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే దాని ప్రభావం అంతంత మాత్రమేనని చెప్పొచ్చు. 


తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. కరోనాలోని గత వేరియంట్లతో పోలిస్తే ఇది అంత ప్రమాదకారి కాదన్న విషయం ఈ అధ్యయనంలో వెలుగుచూసింది.  ఎలుకలు, చిట్టెలకలపై నిర్వహించిన అధ్యయనంలో ఊరట కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. ఈ వేరియంట్ శరీరంలోని పై భాగానికే పరిమితమవుతోందని, కాబట్టి దీనితో పెద్దగా ప్రమాదం ఉండదన్నది అధ్యయన సారాంశం.


గతంలో వైరస్ సోకినప్పుడు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని మరణాలు సంభవించాయి. అయితే, ఒమైక్రాన్ మాత్రం అక్కడి వరకు చేరడం లేదని, కాబట్టి ఇది సోకినా ప్రాణాపాయం తప్పినట్టేనని అధ్యయనకారులు చెబుతున్నారు. ఒమైక్రాన్ వేరియంట్ ముఖ్యంగా ముక్కు, గొంతు, శ్వాసనాళానికే పరిమితం అవుతున్నట్టు గుర్తించారు. దీని వల్ల ఊపిరితిత్తులకు కలిగే నష్టం చాలా స్వల్పమని తేల్చారు.  


ఈ వేరియంట్ ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితమవుతున్నట్టు బెర్లిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌ కంప్యుటేషనల్ బయాలజిస్ట్ రోనాల్డ్ ఈల్స్ చెప్పారు. కరోనా వైరస్‌లు శ్వాసకోశ వ్యవస్థకు ఎలా సంక్రమిస్తాయన్న దానిపై రోనాల్డ్ అధ్యయనం చేశారు. అయితే, గత పరిశోధనలో మాత్రం ఒమైక్రాన్ చాలా ప్రమాదకరమని, ఈ వైరస్‌లు కణాలను గట్టిగా పెనవేసుకుంటాయని తేలింది. యాంటీబాడీల నుంచి తప్పించుకునే విద్య కూడా దీనికి తెలుసని అప్పటి అధ్యయనంలో వెల్లడైంది. అయితే, ఒకసారి లోపలికి ప్రవేశించాక అది ఎలా ప్రవర్తిస్తుందన్నది రహస్యంగానే ఉండిపోయింది.


తాజా పరిశోధన మాత్రం ప్రపంచానికి ఊరటనిచ్చే విషయాలు వెల్లడించింది. ఈ వైరస్ శ్వాసవ్యవస్థపై చూపే ప్రభావం అంతంత మాత్రమే కాబట్టి మునపటి స్థాయిలో ప్రమాదం ఉండబోదని అధ్యయనం అంతిమంగా తేల్చి చెప్పింది. 

Updated Date - 2022-01-02T22:36:11+05:30 IST