విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలి
ABN , First Publish Date - 2022-05-22T06:31:59+05:30 IST
విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర, లయోల పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
కామారెడ్డి టౌన్, మే 21: విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర, లయోల పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇష్టపడి చదవి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఏ గ్రేడ్ మార్కులు సాధించడానికి విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మాల్ప్రాక్టిస్ చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ఫోన్లు, ఎలకా్ట్రనిక్ పరికరాలు తీసుకురావద్దని తెలిపారు. విద్యార్ధులు హాల్ టికెట్లు చూపిస్తే బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజు, పరీక్షల విభాగం అధికారి నీలం లింగం, ఏఈవో ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
28న జరిగే హెచ్సీఎల్ జాబ్మేళాకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చూడాలి
ఈనెల 28న జరిగే హెచ్సీఎల్ జాబ్మేళాకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జరిగిన జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఇంటర్ మీడియట్ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఈ జాబ్మేళాకు హాజరుకావాలని కోరారు. మైనార్టి, కేజీబీవీలో చదివిన విద్యార్థులకు అధ్యాపకులు సమాచారం అందించాలని తెలిపారు. హెచ్సీఎల్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నత చదువులు చదివే వీలుందని తెలిపారు.
డీటీసీపీ లేఅవుట్ ఉన్న ప్లాట్లు ఉన్నాయి
కామారెడ్డి, మే 21: ధరణి టౌన్షిప్లో డీటీసీపీ లేఅవుట్ ఉన్న ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసి లబ్ధిదారులు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు. శనివారం గెలాక్సి ఫంక్షన్హాల్లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ధరణి టౌన్షిప్ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. విద్యుత్ సౌకర్యం, రోడ్లు, తాగునీటి వసతి కల్పిస్తామని తెలిపారు. ఓపెన్ ప్లాట్ల కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఎల్డీవో రమేష్, ఆర్డీవో శ్రీను, ఏవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
స్వయం సహాయక సంఘాలకు 100 శాతం రుణాలు అందించాలి
స్వయం సహాయక సంఘాలకు 100 శాతం రుణాలు అందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో మెప్మా, ఐకేపీ అధికారులతో రుణాల పంపిణీపై చర్చించారు. పది మందికి ఉపాధికల్పించే విధంగా వ్యాపారాలు చేపట్టాలని తెలిపారు. తీసుకున్న రుణాలతో పాడి పరిశ్రమ, బిస్కెట్ల, చాక్లెట్ల తయారీ, చేపల పెంపకం వంటి వ్యాపారాలు చేపట్టాలని తెలిపారు.
రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనభరిచిన విద్యార్థులకు అభినందన
కామారెడ్డి టౌన్, మే 21: హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 20 బాయ్స్ అండ్ గర్ల్స్, సీనియర్ మెన్ అండ్ ఉమెన్ విభాగాలలో మెడల్స్ సాధించిన క్రీడాకారులను శనివారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.