సుమీ నుంచి క్షేమంగా భారత్ చేరుకున్న విద్యార్థులు.. మానసిక ఆరోగ్యంపై తల్లిదండ్రుల ఆందోళన

ABN , First Publish Date - 2022-03-11T23:52:58+05:30 IST

యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లోని సుమీ నగరం నుంచి క్షేమంగా బయటపడి స్వదేశం చేరుకున్న

సుమీ నుంచి క్షేమంగా భారత్ చేరుకున్న విద్యార్థులు.. మానసిక ఆరోగ్యంపై తల్లిదండ్రుల ఆందోళన

న్యూఢిల్లీ: యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లోని సుమీ నగరం నుంచి క్షేమంగా బయటపడి స్వదేశం చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారి మానసిక ఆరోగ్యం, తదుపరి చదువులపై ఆందోళన చెందుతున్నారు. సుమీ నుంచి రెండు పౌర, ఒక ఎయిర్‌ఫోర్స్ విమానం ద్వారా విద్యార్థులు శుక్రవారం భారత్ చేరుకున్నారు. ఘజియాబాద్‌లోని హిందాన్ ఎయిర్‌బేస్‌లో విమానాలు ల్యాండయ్యాయి.  


ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన కుమారుడు దీపేష్ గౌడ్‌ను తీసుకెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న రాజస్థాన్‌లోని బన్స్‌వారాకు చెందిన వైష్ణవ్ సుందరి మాట్లాడుతూ.. తన కుమారుడితో గత రాత్రే మాట్లాడానని, పిల్లలందరూ 24-26 ఏళ్ల వారేనని చెప్పారు. వారందరూ ఏడ్చారని, భవనాలను బాంబులు ధ్వంసం చేయడాన్ని వారు చూశారని అన్నారు. మానసికంగా వారు చాలా దెబ్బతిన్నారని, దాని నుంచి వారు బయటపడేందుకు ఏదో ఒకటి చేయాలని అన్నారు. 


విద్యార్థులు సురక్షితంగా స్వదేశం చేరుకున్నప్పటికీ వారి తదుపరి చదువుల సంగతేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాను ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నానని, కుమారుడిని ఉక్రెయిన్‌ను పంపేందుకు చాలా కష్టపడ్డానని చెప్పారు. ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల చదువులు పూర్తయ్యేందుకు ప్రభుత్వం సాయం చేయాలని సుందరి కోరారు.


ఉక్రెయిన్‌లో అయితే రూ. 30-40 లక్షల్లో వైద్య విద్య పూర్తవుతుందని, అదే ఇండియాలో అయితే అది కోటి రూపాయలు దాటిపోతుందని అన్నారు. వారి భవిష్యత్తుపై ఇప్పుడు ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుందరి ఒక్కరే కాదు.. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులందరూ దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-03-11T23:52:58+05:30 IST