విలీనం వద్దే.. వద్దు
ABN , First Publish Date - 2022-07-07T05:35:24+05:30 IST
తమ పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయవద్దంటూ మాచవరం మండలంలోని కొత్తగణేశునిపాడు ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం ఆర్అండ్బీ రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
రోడ్డెక్కిన తల్లిదండ్రులు, విద్యార్థులు
కొత్తగణేశునిపాడు, నందిరాజుపాలెం, పాకాలపాడుల్లో ధర్నాలు
మాచవరం, బెల్లంకొండ, సత్తెనపల్లి రూరల్, జూలై 6: తమ పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయవద్దంటూ మాచవరం మండలంలోని కొత్తగణేశునిపాడు ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం ఆర్అండ్బీ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. దూరంలో ఉన్న పాఠశాలకు పంపించాలంటే తమ పిల్లలు వెళ్లే పరిస్థితి లేదని, అంతేకాకుండా పాఠశాలకు వెళ్లే రోడ్డు మార్గంలో అనేక రకాల వాహనాలు నిత్యం తిరుగుతుంటాయని, ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ రాజగోపాల్, మాచవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. ఎస్సీ కాలనీలో మొత్తం 250 కుటుంబాలు ఉండగా కేవలం 45 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం విలీనం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయని అధికారులు తల్లిదండ్రులకు సూచించారు. అయితే విద్యార్థుల సంఖ్యపెంచితే విలీనం చేసే ప్రక్రియ ఉండదని సూచించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్నివిరమించుకున్నారు.
నందిరాజుపాలెం పాఠశాల వద్ద..
పాఠశాలలను విలీనం చేసి తమ పిల్లల భవిష్యత్తో చెలగాటం ఆడొద్దని తల్లిదండ్రులు కోరారు. బెల్లంకొండ మండలం నందిరాజుపాలెం, మాచాయపాలెం, న్యూచిట్యాల గ్రామాల్లో ఎంపీపీ స్కూల్లో 6,7,8 తరగతులను బెల్లంకొండ జిల్లాపరిషత్ హైస్కూల్లో విలీనాన్ని నిరసిస్తూ నందిరాజుపాలెంలో బుధవారం విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ పిల్లలు కష్టాలు ఎదుర్కొంటారని తతల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పాత పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ గబ్రూనాయక్కు, ఎంఈఓ రాజకుమారికి శివారెడ్డి, మరియదాసు, న్యూచిట్యాల సర్పంచ్ బి.నరసింహనాయక్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
పాకాలపాడులో..
సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఉన్న ఎంపీపీ స్కూల్ (డిపెప్)ను గ్రామంలోని యూపీ స్కూల్లో విలీనం చేయటాన్ని నిరసిస్తూ ఆపాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీగా ప్రధాన రహదారిపైకి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. విలీనం వద్దు... మా స్కూలే ముద్దు అంటూ నినాదాలు చేశారు. సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించటంతో సత్తెనపల్లి, మాదిపాడు వైపు ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఎస్ఐ గ్రామానికి వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవడంతో ధర్నా విరమించారు.
అదేవిధంగా మండలంలోని నందిగామలో ఉన్న ఎంపీపీ స్కూల్ (ఎల్ఈ) స్కూలు హైస్కూల్లో విలీనం చేయడాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు వ్యతిరేకించారు. పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని పాఠశాలను యధావిధిగా నడపా లని సీపీఎం మండల కార్యదర్శి పెండ్యాల మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల తరఫున పోరాటం చేస్తామన్నారు.