Madhura: చైర్-బ్రిడ్జి మీదుగా పాఠశాలలో అడుగుపెట్టిన టీచరమ్మ

ABN , First Publish Date - 2022-07-29T22:43:53+05:30 IST

జలదిగ్బంధంలో చిక్కుకున్న పాఠశాలలోకి అడుగుపెట్టేందుకు విద్యార్థులు చైర్-బ్రిడ్జిని ఏర్పాటు చేసిన ఓ వీడియా ఒకటి..

Madhura: చైర్-బ్రిడ్జి మీదుగా పాఠశాలలో అడుగుపెట్టిన టీచరమ్మ

మధుర: జలదిగ్బంధంలో చిక్కుకున్న పాఠశాలలోకి అడుగుపెట్టేందుకు విద్యార్థులు చైర్-బ్రిడ్జిని ఏర్పాటు చేసిన ఓ వీడియా ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్లాస్టిక్ కుర్చీలను విద్యార్థులు వరుస క్రమంలో ఒక వంతెన తరహాలో ఏర్పాటు చేశారు. ఆ కుర్చీల మీదుగా నడుచుకుంటూ టీచర్ వెళ్తుంటే, పడిపోకుండా విద్యార్థులు వాటిని పట్టుకున్నారు. దీంతో ఆమె నేరుగా క్లాస్ రూమ్‌లో అడుగుపెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీచరమ్మపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మధురలోని బల్దేవ్ గ్రామ్ పంచాయత్ దఘేటాలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.


పాఠశాలలో నలుగురు ఆడ టీచర్లతో పాటు, ముగ్గురు మగ టీచర్లు ఉన్నారు. వారిలో పల్లవి అనే టీచర్ ఈ వీడియోలో కనిపిస్తోంది. స్కూలు గేటు నుంచి చైర్ బ్రిడ్జి ఏర్పాటు చేయమని విద్యార్థులను ఆమె కోరారు. అసిస్టెంట్ టీచర్‌గా గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఆమె ఈ పాఠశాలలో పనిచేస్తోంది. కాగా, వీడియో వైరల్ కావడంతో ఆమెపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై స్పందించేదుకు పల్లవి టీచర్ నిరాకరించారు. ముందు విద్యార్థులకు పాఠాలు చెప్పనీయండి..అంటూ ఆమె ముక్తసరిగా సమాధానమిచ్చారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ సుజాతా సింగ్ మాట్లాడుతూ, విద్యాశాఖకు విషయం తెలియజేశామని, నిర్ణయం వాళ్లే తీసుకుంటారని అన్నారు. టీచర్‌కు స్కిన్ అలర్జీ ఉందని, మురికిజలాల్లో ఆమె నడవకూడదని కూడా ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ఇదొక ఉదాహరణ అని పలువురు ఈ ఘటనపై వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-07-29T22:43:53+05:30 IST