విద్యార్థుల హాజరు అరకొరే..!
ABN , First Publish Date - 2022-01-18T03:41:58+05:30 IST
సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభమైన పాఠశాలలకు విద్యార్థుల హాజరు శాతం అరకొరగానే ఉంది.
ఉదయగిరి రూరల్, జనవరి 17: సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభమైన పాఠశాలలకు విద్యార్థుల హాజరు శాతం అరకొరగానే ఉంది. వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు పంపేందుకు భయపడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే అధికారికంగా ఐదుగురు ఉపాధ్యాయులు కరోనా పాజిటివ్కు గురైనట్లు విద్యాశాఖాధికారులు తెలుపుతున్నారు. మండలంలో 66 పాఠశాలల్లో 5,139 మంది విద్యార్థులు ఉండగా సోమవారం 2,809 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఉదయగిరి ఉన్నత పాఠశాలలో 620 మంది విద్యార్థులకు 155 మంది మాత్రమే హాజరయ్యారని ఉపాధ్యాయులు తెలిపారు. కొన్ని తరగతులకు ఒకరిద్దరు విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడుతోపాటు పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు పొడిగించారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.