బస్సు ఢీకొని విద్యార్థిని మృతి
ABN , First Publish Date - 2021-02-27T05:29:45+05:30 IST
ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టిన ఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతిచెందింది. ఈ సంఘటన జాతీయ రహదారిపై మరుపల్లి గ్రామంలోని ఓలమ్ కంపెనీ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.
గజపతినగరం, ఫిబ్రవరి 26: ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టిన ఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతిచెందింది. ఈ సంఘటన జాతీయ రహదారిపై మరుపల్లి గ్రామంలోని ఓలమ్ కంపెనీ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. మెంటాడ మండలం జయితి గ్రామానికి చెందిన గెద్ద ఇందు (17) బొండపల్లి మండలంలోని ఓ ప్రైవేటు కళాశా లలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లి, తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూడగా, అప్పటికే బస్సు వెళ్లిపోయింది. దీంతో వరసకు అన్నయ్య అయిన నెమలిపాటి చిన్నంనాయుడుతో బైకుపై స్వగ్రామం బయలుదేరింది. బైకు ఓలం కంపెనీ వద్దకు వచ్చేసరికి.. విజయనగరం నుంచి జయితి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇందును స్థానికుల సహాయంతో ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇందు మృతి చెందినట్టు వైద్యాధికారిణి సీతాస్రవంతి ధ్రువీకరించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.