రాచకొండ చెరువులో విద్యార్థి గల్లంతు

ABN , First Publish Date - 2021-03-05T06:36:44+05:30 IST

పిక్నిక్‌ కోసం వచ్చిన విద్యార్థి చెరువులో పడి గల్లంతయ్యాడు. సంస్థాన్‌ నారాయణ పురం మండలం రాచకొండ గుట్టల్లోని చెరువులో గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.

రాచకొండ చెరువులో విద్యార్థి గల్లంతు
శశికాంత్‌(ఫైల్‌)

కొనసాగుతున్న గాలింపు చర్యలు

సంస్థాన్‌ నారాయణపురం, మార్చి4: పిక్నిక్‌ కోసం వచ్చిన విద్యార్థి చెరువులో పడి గల్లంతయ్యాడు. సంస్థాన్‌ నారాయణ పురం మండలం రాచకొండ గుట్టల్లోని చెరువులో గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన వీరమళ్ల శశికాంత్‌(20) అమీర్‌పేటలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బీబీఏ చదువుతున్నాడు. గురువారం కళాశాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి పిక్నిక్‌ కోసం రాచకొండకు వచ్చారు. రాచకొండలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో రాచకొండ సమీపంలోని రామాలయం వద్ద గల చెరువును సందర్శించారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు సరదాగా ఈత కొట్టారు. శశికాంత్‌ కూడా చెరువులోకి దిగాడు. ఈత రాకపోవడంతో, చెరువులో మునిగిపో యాడు. తోటి విద్యార్థులు గమనించే లోపే చెరువులో గల్లంతయ్యాడు. కళ్ల ముందే తమ తోటి విద్యార్థి గల్లంతు కావడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన చెందు తున్నారు. గల్లంతైన శశికాంత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సుధాకర్‌రావు, ఏఎస్‌ఐ శ్యాంసుందర్‌రెడ్డి సందర్శించి, మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శశికాంత్‌ తండ్రి కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు.  


 చికిత్స పొందుతూ వ్యక్తి మృతి 

వలిగొండ, మార్చి 4: క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో గురువారం మృతి చెందాడు. మండలంలోని గురునాధ్‌పల్లి గ్రామానికి చెందిన ఏడుమేకల కృష్ణ (45) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫిబ్రవరి 24న పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని హైదరా బాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కృష్ణ కుమారుడు మత్స్యగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు. మృతుడు కృష్ణకు భార్య అవివాహితులైన ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 

Updated Date - 2021-03-05T06:36:44+05:30 IST