నీటికుంటలో విద్యార్థి గల్లంతు

ABN , First Publish Date - 2022-05-27T07:25:03+05:30 IST

నీటికుంటలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఓ విద్యార్థి గల్లంతయ్యాడు.

నీటికుంటలో విద్యార్థి గల్లంతు
నీటికుంటలో గాలిస్తున్న ఫైర్‌ సిబ్బంది - గల్లంతైన సుమంత్‌రెడ్డి

తిరుచానూరు, మే 26: నీటికుంటలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. తిరుచానూరు ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామానికి చెందిన సుమంత్‌రెడ్డి(20) తిరుచానూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో బీఫార్మసీ చదువుతున్నాడు. గురువారం సాయంత్రం తిరుపతి రూరల్‌ మండలం తనపల్లె సమీపంలోని ఓ నీటికుంటలో స్నేహితులతో కలిసి సరదాగా ఈతకొట్టడానికి వెళ్లాడు. సుమంత్‌రెడ్డి బురదలో చిక్కుకున్నాడు. పైగా ఆ కుంట లోతు ఎక్కువగా ఉంది. ఎవరికీ ఈత రాకపోవడంతో అతడిని కాపాడలేకపోయారు. విషయం తెలియడంతో ఫైర్‌, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థి కోసం ఎంతసేపు గాలించినా ప్రయోజనం లేకపోయింది. రాత్రి కావడంతో శుక్రవారం ఉదయం గాలింపు కొనసాగిస్తామని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-27T07:25:03+05:30 IST