రైతు సమస్యలపై పోరాటాలు అవసరం
ABN , First Publish Date - 2022-05-23T06:21:32+05:30 IST
ఢిల్లీలో రైతుల పోరాటాల స్ఫూర్తితో అనకాపల్లి జిల్లాలో రైతు సమస్యలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు
అనకాపల్లి టౌన్, మే 22: ఢిల్లీలో రైతుల పోరాటాల స్ఫూర్తితో అనకాపల్లి జిల్లాలో రైతు సమస్యలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక దొడ్డిరామునాయుడు భవనంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఎనిమిదో మహాసభలు ఆదివారం జరిగాయి. ముందుగా రైతు సంఘం జెండాను సాపిరెడ్డి నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలోని నాలుగు చక్కెర కర్మాగారాలను ఆధునికీకరించి రైతులు, కార్మికుల పాత బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. చెరకు మద్దతు ధరను రూ.3,500 ప్రకటించాలని, అనకాపల్లి కేంద్రంగా షుగర్ కాంప్లెక్స్, ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, బెల్లంపై ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతులు, వర్తకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్ను తెరిపించాలని కోరారు. బలవంతపు భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ ఆపాలని, 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని సమావేశంలో తీర్మానం ఆమోదించారు. గత మూడేళ్లలో చేపట్టిన ఉద్యమాల గురించి సమీక్షించారు. అలాగే రాబోయే మూడేళ్లలో రైతుల కోసం చేయాల్సిన పోరాట కార్యక్రమాలను చర్చించారు. ఈ సభలో రైతు సంఘం నాయకులు జి.నాయనబాబు కర్రి అప్పారావు, ఎం. అప్పలరాజు, ఎ.బాలకృష్ణ, ఎస్వీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.