ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటం
ABN , First Publish Date - 2021-12-03T06:23:01+05:30 IST
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాడతామని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ తెలిపారు.
ఎమ్మెల్సీ రఘువర్మ
సబ్బవరం, డిసెంబరు 2 : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాడతామని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ తెలిపారు. గురువారం స్థానిక కేజీబీవీలో ఉపాధ్యాయులు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు న్యాయంగా రావలసిన పీఆర్సీ, కరువు భత్యం రెండేళ్లుగా ఇవ్వలేని పరిస్థితి ఇంత వరకూ ఏ ప్రభుత్వ హయాంలో లేదన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలుకాకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం దారుణమన్నారు. వీరికి ఉద్యోగ భద్రతతో పాటు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఉన్నత పాఠశాలల సిబ్బంది మాదిరిగా కేజీబీవీ సిబ్బందికి కూడా పదవ తరగతి, ఇంటర్ సిబ్బందితో సమానంగా ఇన్విజిలేషన్, స్పాట్ వాల్యూయేషన్ విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ సిబ్బంది సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.రాజశేఖర్, జిల్లా కార్యదర్శి కరుణాకర్, హేమంత్ సుదేవ్, ఆర్.అప్పలనాయుడు, ఎన్.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.