సమస్యలపై పోరాడాలి
ABN , First Publish Date - 2020-10-19T06:08:53+05:30 IST
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్యూఐ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలు, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు
పార్టీ పూర్వ వైభవానికి కృషి
ఎన్ఎస్యూఐ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
నెల్లూరు (వైద్యం), అక్టోబరు 18 : కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్యూఐ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలు, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరులోని ఇందిరాభవన్లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త సంఘటితంగా ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ఈ చర్యలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకోవాలన్నారు. ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి అనులేఖ, రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాటంలో ముందుంటామన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ నవంబరు 2వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, కొవిడ్ నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కరీముల్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మోహన్రావు, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు ఏటూరి శ్రీనివాసులురెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొండా అనిల్కుమార్, పలు జిల్లాల ఎన్ఎస్యూఐ అధ్యక్షులు పాల్గొన్నారు.