కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
ABN , First Publish Date - 2021-09-18T03:50:29+05:30 IST
స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో ఈ నెల 19న కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, జలదంకి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని కావలి ఆర్డీవో శీనానాయక్ తెలిపారు.
144 సెక్షన్ అమలు, ర్యాలీలు, బాణసంచాలు నిషేధం
కలిగిరి, సెప్టెంబరు 17: స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో ఈ నెల 19న కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, జలదంకి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని కావలి ఆర్డీవో శీనానాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన డీఎస్పీ ప్రసాద్రావుతో కలసి ఏర్పాట్లు పరిశీలించారు. ఐదుగురు రిటర్నింగ్ ఆఫీసర్లు, ఎంపీడీవో, తహసీల్దార్ల పర్యేవేక్షణలో లెక్కింపు జరుగుతుందన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ తీసుకొచ్చిన వారిని మాత్రమే కౌటింగ్ హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. డీఎస్పీ ప్రసాద్ రావు మాట్లాడుతూ స్థానిక సీఐ సాంబశివరావు పర్యవేక్షణలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. కౌంటింగ్ తరువాత ర్యాలీలు, బాణాసంచా కాల్చడానికి, విజయోత్సవ కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవని, అటువంటి ఘటనలు చోటుచేసుకుంటే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదుచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దారు పద్మావతి తదితరులు పాల్గొన్నారు.