ఉప ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు
ABN , First Publish Date - 2021-10-18T05:30:00+05:30 IST
బద్వేలు ఉప ఎన్నిక స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ అన్బురాజన్ అధికారులను ఆదేశించారు.
పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం
కడప(క్రైం), అక్టోబరు 18: బద్వేలు ఉప ఎన్నిక స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ అన్బురాజన్ అధికారులను ఆదేశించారు. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో ప్రతి మండలానికి ఒక డీఎస్పీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తారని, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్), ఏఆర్ అదనపు ఎస్పీలు బందోబస్తును పర్యవేక్షిస్తారని అన్నారు. అన్ని రూట్లలో రూట్ మొబైల్స్ స్ర్టైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ర్టైకింగ్ ఫోర్స్ ద్వారా పకడ్బందీగా భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెట్రోలింగ్ పార్టీకి ఎస్ఐ, స్ర్టైకింగ్ ఫోర్స్కు సీఐ, స్పెషల్ స్ర్టైకింగ్ ఫోర్స్కు డీఎస్పీ ఇన్చార్జ్గా ఉంటారన్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, పోలింగ్ బూత్కు 100 మీటర్ల పూరిధిలో ఓటర్లు మినహా ఎవరూ ఉండకూడదని, ఓటు హక్కు వినియోగించుకున్న వారు వెంటనే పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోవాలని అన్నారు. పోలింగ్కు 48 గంటల ముందు బయటి ప్రాంతాల వ్యక్తులు ఎవరూ ఉండకూడదని, లాడ్జీలు, కళ్యాణమండలపాలను తనిఖీ చేసి పంపించేయాలని ఆదేశించారు. సమావశంలో జిల్లాలోని డీఎస్పీలు, ఎస్బీ ఇనస్పెక్టర్లు పాల్గొన్నారు.