భక్తితత్వాన్ని పెంపొందించేందుకు కృషిచేయండి

ABN , First Publish Date - 2022-01-19T06:52:47+05:30 IST

సమాజంలో భక్తితత్వాన్ని పెంపొందించేందుకు సనాతన హైందవ ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పిలుపునిచ్చారు.

భక్తితత్వాన్ని పెంపొందించేందుకు కృషిచేయండి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు ఈవో ధర్మారెడ్డి

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి


తిరుమల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సమాజంలో భక్తితత్వాన్ని పెంపొందించేందుకు సనాతన హైందవ ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలలోని మాధవ నిలయంలో బస చేశారు. తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల, రంపచోడవరం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వీరిని ఉద్దేశించి ధర్మారెడ్డి మాట్లాడారు. గతేడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లోని భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామన్నారు. ప్రతిరోజు వెయ్యి మంది భక్తులు దర్శనం చేసుకున్నారన్నారు. జీవితంలో తొలిసారిగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నందుకు ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార వర్గాలకు చెందిన భక్తులు ఎనలేని ఆనందాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. హిందూధర్మ ప్రచారంలో భాగంగా సమరసత సేవా ఫౌండేషన్‌తో కలిసి 502 దేవాలయాలను టీటీడీ నిర్మించినట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార వర్గాల నుంచి వచ్చిన వారికి అర్చకత్వంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి హిందూ ధర్మప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో మత మార్పిడులు జరగకుండా చూడటమే లక్ష్యమన్నారు. మొదటిసారిగా శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందంటూ భక్తులు పేర్కొన్నారు. ఉచిత రవాణాతో పాటు భోజనాలు, వసతి కల్పించిన టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఈవోలు హరీంద్రనాథ్‌, భాస్కర్‌, సమరసత సేవా ఫౌండేషన్‌ ప్రతినిధులు జగన్మోహన్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌, ఇందిరాదేవి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T06:52:47+05:30 IST