బట్టలూడదీసి కొడతారా?

ABN , First Publish Date - 2022-07-22T07:41:35+05:30 IST

పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీ మహిళలను బట్టలూడదీసి కొడతారా? అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

బట్టలూడదీసి కొడతారా?

  • మహిళలకు కనీస రక్షణ కరువు: షర్మిల
  • మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో పర్యటన 

మంచిర్యాల/ధర్మపురి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీ మహిళలను బట్టలూడదీసి కొడతారా? అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడ ఆదివాసీ మహిళలను గురువారం ఆమె పరామర్శించారు. పోడు భూముల్లో ఆదివాసీలు ఏర్పరుచుకున్న తాత్కాలిక నివాసాలను ఈ నెల 8న అటవీ అధికారులు తొలగించి మహిళలను ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. కోయపోచగూడకు వచ్చిన షర్మిల ఆదివాసీల సమస్యలను తెలుసుకున్నారు. భూముల కోసం 52 కుటుంబాలు పోరాడుతున్నాయని, ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు.  కేసీఆర్‌ పాలనలో ఆడవారికి కనీస రక్షణ కూడా లేదని ఆవేదన చెందారు. పోడు భూముల్లో పట్టాల కోసం ఆదివాసీల తరపున పోరాడతానని చెప్పారు. అనంతరం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ కాలనీలో వర్షాల కారణంగా ఇల్లు మునిగి, ఆస్తినష్టం జరగడంతో ఆత్మహత్య చేసుకున్న సిద్ద జమున కుటుంబాన్ని పరామర్శించారు. నీట మునిగిన కాలనీల్లో పర్యటించారు. కేసీఆర్‌ వైఫల్యం వల్లనే వరదలు ముంచెత్తాయని విమర్శించారు. ముంపు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేలు సరిపోవని, కనీసం రూ.25 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.5వేల చొప్పున వైఎస్సార్‌టీపీ తరపున అందజేస్తామని హామీ ఇచ్చారు.  


బాధితులకు సాయమేదీ?

వరద బాధితులను ఆదుకోవటం లో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని షర్మిల ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో  వరద తాకిడికి గురైన ఇందిరమ్మ కాలనీని సందర్శించారు. బాధితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఆర్థికసాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-07-22T07:41:35+05:30 IST