సమ్మెకు సై..

ABN , First Publish Date - 2022-01-20T06:53:00+05:30 IST

సమ్మెకు సై..

సమ్మెకు సై..

రేపు సీఎ్‌సకు ఏపీ జేఏసీ నోటీసు

పీఆర్సీ జీవోలు రద్దు చేసేవరకు సమైక్య పోరు!

మిగతా సంఘాలు కూడా అదేబాటలో..

రివర్స్‌ పీఆర్సీపై తొలిసారి ఏకతాటిపైకి

ఉద్యోగ నేతల మధ్య ‘ఉమ్మడి’ మాటలు

అందరినీ కలుపుతా: సూర్యనారాయణ

పీఆర్సీ సాధన కమిటీ ఏర్పాటుకు సూచన

స్వాగతించిన బండి, బొప్పరాజు

నల్లబ్యాడ్జీలతో సచివాలయానికి  ఉద్యోగులు

నేడు ‘ఫ్యాప్టో’ కలెక్టరేట్ల ముట్టడి


సీఎస్‌ పచ్చి అసత్యాలు మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ వల్ల ఎలాంటి నష్టమూ లేదన్న 

అసత్యపు మాటలను తక్షణం ఉపసంహరించుకోవాలి. ఉద్యోగుల పాలిట గొడ్డలి పెట్టుగా మారిన 

జీవోలను రద్దు చేసే వరకు ఎవరితోనూ చర్చించబోం. ప్రభుత్వం ఇదే వైఖరితో ఉంటే సమ్మె చేయటానికి కూడా వెనుకాడకూడదని నిర్ణయించుకున్నాం. సమ్మె నోటీసు ఇస్తాం.

-బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్‌


అమరావతి/విజయవాడ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన సర్కారుపై  ‘సమ్మె అస్త్రం’ ప్రయోగించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. వేర్వేరు సంఘాలన్నీ ఉమ్మడిగా కలిసి వచ్చి... ఉద్యమించాలని నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి... ‘జీతం తగ్గదు. పెరుగుతుంది. మీరే సరిగా అర్థం చేసుకోలేదు’ అన్నట్లుగా మాట్లాడటంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ‘న్యాయమైన పీఆర్సీయే లక్ష్యం’గా పోరాడాలని నిర్ణయించుకున్నారు. గురువారం సమావేశమై ఉద్యమ కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. పీఆర్సీ రద్దు కోసం సమ్మెకు సైతం సిద్ధమని దాదాపు అన్ని సంఘాలు ప్రకటించాయి. ఏపీ జేఏసీ నేత, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు బుధవారం దీనిపై కీలక ప్రకటన చేశారు. శుక్రవారం సీఎ్‌సకు సమ్మె నోటీసు ఇస్తామని ఆయన  ప్రకటించారు. నేడో రేపో మిగిలిన అన్ని సంఘాలు, ఇరు జేఏసీల ఐక్య కార్యాచరణ వేదిక చర్చించుకుని నిర్ణయం తీసుకోనున్నాయి. పీఆర్సీ కోసం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు గతంలో ఎన్నడూ సమ్మె చేయలేదు. ఇప్పుడు... విషయం సమ్మెదాకా వెళితే, ఇది తొలి ‘పీఆర్సీ సాధన సమ్మె’ అవుతుంది.


ఉమ్మడిగా ఉద్యమం...

పీఆర్సీపై ఎవరికి వారుగా కాకుండా... సంఘాలన్నీ ఉమ్మడిగా ఉద్యమించాలని పలు ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. ఉద్యోగ సంఘాలను ఏకం చేయడం కోసం ఒక మెట్టు దిగిరావడానికి సిద్ధమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ బుధవారం విజయవాడలో ప్రకటించారు. ఉద్యమ కార్యాచరణ దిశగా అన్ని సంఘాలతో చర్చించి.. పీఆర్‌సీ సాధన సమితి అనే ఉమ్మడి వేదిక నిర్మాణానికి చొరవ తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. సూర్యనారాయణ చేసిన ప్రకటనను ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు స్వాగతించారు. ఈ విషయంలో సూర్యనారాయణతో కలిసివెళ్లి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిలతో కూడా మాట్లాడతానని ప్రకటించారు. అంతకుముందే ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇదే మాట చెప్పారు. సూర్యనారాయణ నాయకత్వంలో జరిగిన ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణపైనే ప్రధానంగా చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని సాధించుకునేందుకు ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉంది. వ్యక్తిగత అహంకారాలు, ఆధిపత్య ధోరణులు, సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిన తరుణం ఇది. దీనికి నాందీ ప్రస్తావనగా నేనే ఒక మెట్టుదిగి అన్ని సంఘాల దగ్గరికి వెళ్లి సంఘటిత పోరాటాలకు వాటిని సమాయత్తం చేస్తాను.  దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అనుబంధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు ఐదుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేశాం’’ అని సూర్యనారాయణ వివరించారు. ఈ కమిటీలో చొప్పా రవీంద్రబాబు (ఏపీజీఈఏ), మిట్టా కృష్ణయ్య(పీఆర్టీయూ), శ్రావణ్‌కుమార్‌(ఏపీయూఎస్‌) వీ దివాకర్‌ (రెవిన్యూ జేఏసీ), జీ నరసింహారావు (జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌) సభ్యులుగా ఉంటారని తెలిపారు. 


నేడు కలెక్టరేట్ల ముట్టడి

పీఆర్సీ జీవోలను తక్షణమే రద్దు చేయాలని గురువారం ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించనున్నారు. జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి ఫ్యాప్టో(ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య)  పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉద్యమ శంఖారావం వినిపించడానికి సిద్ధమైంది. ఫ్యాప్టో ఉద్యమ పిలుపును ఇరు జేఏసీల ఐక్యవేదిక స్వాగతించింది. తన సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, హృదయరాజు, వైవీ రావులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21 నుంచి జరిగే ఆందోళనలో పంచాయతీరాజ్‌ ఉద్యోగులు పాల్గొనాలని ఏపీ పీఆర్‌ మినీస్టీరియల్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - 2022-01-20T06:53:00+05:30 IST