తగ్గించకుంటే సమ్మె
ABN , First Publish Date - 2021-02-27T05:44:23+05:30 IST
పెట్రోలు, డీజిల్లు జీఎస్టీ పరిధిలోకి తీసుకరాకపోతే దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకైనా సిద్ధమని లారీ యజమానులు, కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.
- లారీ యజమానులు, కార్మిక సంఘాల నేతల హెచ్చరిక
- ప్రశాంతంగా లారీల బంద్
కర్నూలు(న్యూసిటీ), ఫిబ్రవరి 26: పెట్రోలు, డీజిల్లు జీఎస్టీ పరిధిలోకి తీసుకరాకపోతే దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకైనా సిద్ధమని లారీ యజమానులు, కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. పెంచిన ధరలను తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ లారీ యజమాన్య సంఘా లు దేశవ్యాప్తంగా శుక్రవారం లారీల బంద్కు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగా నగరంలోని బళ్తారి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపైన లాంగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్, జిల్లా మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు ఎక్కడివ క్కడ నిలిచిపోయాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మిన్నల్లా, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌస్దేశాయ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ప్రజల సొమ్ము పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే గగ్గోలు పెట్టిన మోదీ.. ఇప్పుడు వాటిని ఎలా పెంచుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా రాష్ట్ర ప్రజలపై భారం వేసి నడ్డి విరగ్గొడుతున్నాయని విమర్శించారు. యూనియన్ నాయకులు రియాజ్, గంగాధర్, చాంద్బాషా షరీఫ్, విజయ్, శ్రీధర్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో వెంకటరమణకాలనీలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ధర్నా చేపట్టారు. సీపీఎం నాయకుడు పుల్లారెడ్డి మాట్లాడుతూ ఇతర దేశాల్లో కరోనా వల్ల ప్రజలను ఆదుకునేం దుకు ఆర్థిక సాయం చేస్తుంటే.. మన దేశంలో ధరలు పెంచు తూ సంపన్నులకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నా రని విమర్శించారు. అంతకుముందు నగరంలోని పెట్రోల్ బంకుల ఎదురుగా వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
నంద్యాల శ్రీనివాససెంటర్ జంక్షన్లో వామపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు రాస్తారోకో చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లారీ, మోటార్ వర్కర్స్ యూనియన్, లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూనెపల్లె పెట్రోల్ బంక్ వద్ద నిరసన చేపట్టారు.
ఎమ్మిగనూరులో ఎంజీ పెట్రోల్ బంక్ ముందు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, లేకుంటే ఆందోళ నలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఆదోనిలో పెట్రోల్ బంక్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గ్యాస్, పెట్రో ధరలు తగ్గించాలని నాయకులు డిమాండ్ చేశారు.