ఇసుక అవినీతిపై కఠిన చర్యలు : జేసీ
ABN , First Publish Date - 2020-06-06T10:13:23+05:30 IST
ఇసుక ర్యాంపుల నిర్వహణ, రవాణాలో అవినీతికి పాల్పడే కఠిన చర్యలు
కొవ్వూరు / నిడదవోలు / పెరవలి రూరల్, జూన్ 5 : ఇసుక ర్యాంపుల నిర్వహణ, రవాణాలో అవినీతికి పాల్పడే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. కొవ్వూరు పట్టణ, మండలంలోని ఇసుక ర్యాంప్లలో శుక్రవారం ఆయ న తనిఖీ చేశారు. ర్యాంపులలో ఇసుక నిల్వలు పరిశీలించారు.
పడవ యజమానుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ర్యాంపులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమయ పాలన పాటించేవిధంగా అధికారులను ఆదేశించామన్నారు. ర్యాంప్లలో ఇసుక స్టాక్ పాయింట్లకు తరలించాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేం దుకు వలస కార్మికుల జాబితాలను అందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మారెడ్డి ఉన్నారు. పెరవలి మండలం ఖండవల్లి, ఉసులుమర్రులో ఇసుక ర్యాంపులను కూడా ఆయన పరిశీలించారు.
‘ఇంటింటికి ఇసుక’ సక్రమంగా జరగాలి
ఇంటింటికి ఇసుక సక్రమంగా జరగాలని జేసీ వెంకటరమణా రెడ్డి అన్నారు. పెండ్యాల ఇసుక ర్యాంపును శుక్రవారం ఆయన పరిశీలించారు. శనివారం జీడిగుంట ర్యాంపును ప్రారంభిస్తామని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పందలపర్రు ర్యాంపును నీటి ప్రవాహం తగ్గిన వెంటనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.