పర్యావరణానికి హానికలిగిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2021-10-26T06:09:57+05:30 IST
పర్యావరణానికి హాని కలిగించే నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ కే శంకర్కుమార్ హెచ్చరించారు.
- రామగుండం కార్పొరేషన్ కమిషనర్ కే శంకర్కుమార్
కోల్సిటీ, అక్టోబరు 25: పర్యావరణానికి హాని కలిగించే నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ కే శంకర్కుమార్ హెచ్చరించారు. సోమవారం రామగుండం మున్సిపల్ కార్యాలయంలో మాంసం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 75మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీబ్యాగుల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా టిఫిన్ బాక్స్ల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా అనేకం అందుబాటులోకి వచ్చాయని, పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్ చేతి సంచులను వాడరాదన్నా రు. వధశాలల్లో పశువులను వధించాలని, బయట ఎక్కడైనా వధించినా భారీ జరిమానాతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- పారిశుధ్యం నిర్వహణపై సమీక్ష..
రామగుండం నగరపాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణను సోమవారం కమిషనర్ శంకర్కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్లో రామగుండం నగరానికి మొదటి బహుమతి సాధించేలా సిబ్బంది శ్రమించాలని సూచించారు. రామగుండం నగరాన్ని త్వరలోనే సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్ బృందం సందర్శించనున్నారని, అందుకోసం సర్వసన్నధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. నగరంలోని ప్రజా, సామాజిక మరుగుదొడ్లన్నీ శుభ్రంగా ఉండే విధంగా చూడాలని, సిబ్బంది అంతా పీపీఈ కిట్లు ధరించి పనిచేసేలా చూడాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ నారాయణరావు, ఏఈ జమీల్, శానిటరీ ఇన్స్పెక్టర్ కిశోర్కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.