ప్లాస్టిక్ సంచులు వాడినా, విక్రయించినా కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-07-02T05:03:59+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం 125 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులను వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్ల హెచ్చరించారు.
మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్ల హెచ్చరిక
పటాన్చెరు/జిన్నారం/నారాయణఖేడ్/సదాశివపేట, జూన్ 1: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం 125 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులను వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత, బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్ రోజారాణి, నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ గోపు మల్లారెడ్డి, సదాశివపేట మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం అమీన్పూర్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ సుజాత స్పష్టం చేశారు. వ్యాపారులు తమ దుఖాణాల ఎదుట వంద లీటర్ల సామర్ధ్యం ఉన్న స్టీల్ డబ్బాలలో చెత్తను నిల్వ చేసి విధిగా మున్సిపల్ సిబ్బందికి అప్పగించాలని రోడ్లపై వేస్తే కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ అధికారులు రాజు, వసంత, శశికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బొల్లారం మున్సిపాలిటీలో మెప్మా రిసోర్సు పర్సన్ స్వయం ఉపాధిలో భాగంగా ఏర్పాటు చేసిన పర్యావరణ హిత క్యారీబ్యాగ్స్ ప్యాకేజీ మెటీరియల్ ఉత్పత్తుల స్టోర్ను మున్సిపల్ చైర్పర్సన్ రోజారాణి, మాజీ జడ్పీటీసీ బాల్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్ రాజేంద్రకుమార్, కౌన్సిలర్ శైలజ, మెప్మా బీఎంసీ మల్లేశ్వరీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నారాయణఖేడ్ మున్సిపల్లో వ్యాపారులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. సదాశివపేట మున్సిపాలిటీలో హోటళ్లు, వాణిజ్య సముదాయాలను తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న యజమానులకు రూ.11,500, అపరిశుభ్రమైన ఆహారం నిల్వలున్న హోటళ్లకు రూ.23వేల జరిమానా విఽధించారు.