నిబంధనలకు నీళ్లు..

ABN , First Publish Date - 2022-09-18T06:39:26+05:30 IST

మండల పరిధిలోని గోపవరంలో లక్షలాది రూపాయలతో వేసిన పంచాయితీ మంచినీటి బోరు నిరుప యోగంగా ఉంది.

నిబంధనలకు నీళ్లు..
గోపవరంలో నిరుపయోగంగా పంచాయతీ బోరు

నిరుపయోగంగా పంచాయతీ మంచినీటి బోరు

పైప్‌లైన్ల నిర్మాణంలో నిబంధనలు పాటించని అధికారులు


ముసునూరు, సెప్టెంబరు 17: మండల పరిధిలోని గోపవరంలో లక్షలాది రూపాయలతో వేసిన పంచాయితీ మంచినీటి బోరు నిరుప యోగంగా ఉంది. రెండేళ్ళ క్రితం గ్రామ శివారు లో ఉన్న అయ్యన్న చెరువు కళింగ సమీపంలో రూ. 14 లక్షల నిధులతో నూతనంగా బోరు వేసి, విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు.  నిబంధనలకు విరుద్ధంగా బోరు దగ్గర నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెయిన్‌ వాటర్‌ ట్యాంకుకు పీవీసీ పైపులతో లైన్‌ వేశారు. అయితే బోరు పనిచేస్తున్న గంటల వ్యవధిలోనే పైప్‌లైన్‌ పలు చోట్ల పగిలిపోవటంతో నాటి నుంచి నేటి వరకు బోరు నిరుపయోగంగా ఉంది. సంబంధిత కాంట్రాక్టర్‌కు నూతన బోరుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు  పూర్తిగా బిల్లులు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల లక్షల్లో ప్రజాధనం దుర్వినియోగం అయిందని మండిపడుతున్నారు. మంచినీటి అవసరాలకు నిధులు ప్రభుత్వం ఇస్తుంటే  నిబంధనలను తుంగలో తొక్కి కమీషన్‌లకు కక్కుర్తిపడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిరుపయోగంగా ఉన్న మంచినీటి బోరును వినియోగంలోకి  తెచ్చేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు. 


త్వరలో కొత్త పైపులైన్‌ వేస్తాం

గోపవరంలో రెండేళ్ళ క్రితం వేసిన మంచినీటి బోరుకు సంబంధించి నూతనంగా పైప్‌లైన్‌ పనులను త్వరలో ప్రారంభిస్తాం. ఇటీవల బదిలీల్లో నేను కొత్తగా వచ్చా. గతంలో ఏం జరిగిందో  తెలియదు. నిబంధనలకు విరుద్ధంగా పీవీసీ పైపులు వేసిన మాటా వాస్తవం. జల జీవన్‌ మిషన్‌లో నూతన పైప్‌లైన్‌కు టెండర్‌ పిలిచాం. వర్క్‌ ఆర్డర్‌ కూడా వచ్చింది. సూమారు రూ. 10 లక్షల వ్యయంతో నూతన పైప్‌లైన్‌ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

 – కేవీ సత్య ప్రసాద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, ముసునూరు మండలం 


Updated Date - 2022-09-18T06:39:26+05:30 IST