జీతం ఇక్కడ.. విధులు అక్కడ!
ABN , First Publish Date - 2022-05-21T06:31:07+05:30 IST
మండలంలో వివిధ శాఖల అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ముదినేపల్లి మండలంలో ఇన్చార్జిల పాలన
పెరిగిన పని భారం.. అభివృద్ధి పనుల్లో జాప్యం
ముదినేపల్లి, మే 20 : మండలంలో వివిధ శాఖల అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నా ఉన్నతాధికారులు వాటి భర్తీపై దృష్టి పెట్టడం లేదు. కొన్ని పోస్టుల్లో ఇతర మండలాల అధికారులను పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తున్నారు. దీంతో అధికార కార్యకలాపాల అమలులో జాప్యం జరగటమే కాక, ఒక శాఖకు చెందిన అధికారికి మరో మండల బాధ్యతలు అప్పగించటంతో పని భారం కూడా పెరుగుతోంది.
ముదినేపల్లి ఎంపీడీవో కె.మణికుమార్ను డిప్యుటేషన్పై 2020 జూన్లో గుడ్లవల్లేరు ఎంపీడీవోగా నియమించారు. దీంతోపాటు ఆయనకు గుడివాడ డివిజన్ డీఎల్పీవోగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ముదినేపల్లి మండలానికి తిరిగి రాలేదు. డిప్యుటేషన్పై ఉండటంతో ముదినేపల్లి ఎంపీడీవో పోస్టును ఖాళీగా చూపించటం లేదు. కొంతకాలం మండల పరిషత్ పరిపాలన అధికారి ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహించగా, ప్రస్తుతం ఈవోపీఆర్డీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. రెండేళ్లుగా ఇలా జరుగుతోంది. ఇప్పుడు ముదినేపల్లి మండలం ఏలూరు జిల్లాలో విలీనం కాగా, గుడ్లవల్లేరు కృష్ణాజిల్లాలో ఉంది. రెండు నెలలుగా జీతం ఏలూరు జిల్లాలో తీసుకుంటూ విధులు కృష్ణాజిల్లాలో నిర్వహిస్తున్నారు. ఇక మండల విద్యాధికారి పోస్టు ఏడాది ఖాళీగా ఉంది. కలిదిండి ఎంఈవో నరేష్ కుమార్ ముదినేపల్లి మండల ఎంఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంటున్నది.
డ్రెయినేజీల ప్రక్షాళన జరిగేనా..?
ఇరిగేషన్, డ్రెయినేజీ శాఖలు ఇన్చార్జ్ల ఏలుబడిలోనే ఉన్నాయి. మండలంలోని పోల్రాజ్ కెనాల్, పోల్రాజ్ డ్రైన్ ముదినేపల్లి సెక్షన్లకు సుమారు రెండేళ్ల నుంచి కైకలూరు ఏఈలు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈ శాఖలకు రెగ్యులర్ ఏఈలు లేకపోవటంతో డెక్క తొలగింపు, కాల్వల మరమ్మతు పనులు మూలపడ్డాయి. మండలంలో ఖాళీగా ఉన్న అధికారుల పోస్టులు భర్తీ చేసేందుకు ఏలూరు జిల్లా అధికారులైనా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.