అత్యాశ!

ABN , First Publish Date - 2020-10-22T05:46:01+05:30 IST

దేవీపురం అనే రాజ్యాన్ని సోమశేఖరుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడికి దైవభక్తి ఎక్కువ. నిజాయతీపరుడు. తన రాజ్యంలోని ప్రజలకు చిన్న కష్టం కూడా రాకుండా చూసుకునే వాడు. అతని నిజాయతీకి మెచ్చి ఒకరోజు భగవంతుడు ప్రత్యక్షమయి, ఏం వరం కావాలో కోరుకో అంటాడు...

అత్యాశ!

దేవీపురం అనే రాజ్యాన్ని సోమశేఖరుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడికి దైవభక్తి ఎక్కువ. నిజాయతీపరుడు. తన రాజ్యంలోని ప్రజలకు చిన్న కష్టం కూడా రాకుండా చూసుకునే వాడు. అతని నిజాయతీకి మెచ్చి ఒకరోజు భగవంతుడు ప్రత్యక్షమయి, ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు రాజు ‘‘మీరు నాకు దర్శనమిచ్చారు. నేను పుణ్యాత్ముడిని అయ్యాను. కానీ నేను ఒక్కడినే పుణ్యాత్ముడిని కావడం నాకు ఇష్టం లేదు. నా రాజ్యంలోని ప్రజలందరూ కూడా పుణ్యాత్ములు కావాలి. అంటే మీరు నా రాజ్యంలోని ప్రజలందరికీ దర్శనభాగ్యం కలిగించండి’’ అని వేడుకున్నాడు. అందుకు భగవంతుడు సరేనని ఒప్పుకున్నాడు. ‘‘రేపు ఉదయాన్నే రాజ్యంలోని ప్రజలందరినీ తీసుకుని ఊరి చివర ఉన్న కొండ దగ్గరకు తీసుకుని రా’’ అని చెప్పి భగవంతుడు అదృశ్యమయ్యాడు.


మరుసటి రోజు ఉదయాన్నే రాజు, తన భార్యతో సహా ప్రజలందరినీ తీసుకుని కొండ వద్దకు బయలుదేరాడు. దారి మధ్యలో ఒకచోట వెండి నాణేలు కనిపించాయి. దాంతో సగం మంది ప్రజలు వాటికోసం ఆగిపోయారు. మరికాస్త దూరం వెళ్లాక దారిలో బంగారు నాణేలు కనిపించాయి. అక్కడ మిగిలిన ప్రజలందరూ ఆగిపోయారు. చివరకు రాజు, అతడి భార్య మాత్రమే మిగిలారు. వాళ్లిద్దరూ కొండవైపు నడక మొదలుపెట్టారు. కాస్త దూరం వెళ్లగానే వజ్రాల మేడ కనిపించింది. ఆ మేడను చూడగానే రాజు భార్య పరుగున వెళ్లిపోయింది. ఇక రాజు ఒక్కడే కొండ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడికి వెళ్లగానే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ‘‘నా రాజ్యంలోని ప్రజలందరూ పుణ్యాత్ములు కావాలని అనుకున్నావు. కానీ వాళ్లకు అత్యాశ ఎక్కువ. ఒకవేళ వాళ్లు అత్యాశకు పోకుండా నా దగ్గరకు వచ్చుంటే జీవితాంతం సంతోషంగా ఉండే వాళ్లు. కానీ డబ్బుకు ఆశపడ్డారు. నువ్వు మాత్రం ఆశపడలేదు. అందుకే నీకు మాత్రమే కనిపించాను’’ అని భగవంతుడు రాజును ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు.

Updated Date - 2020-10-22T05:46:01+05:30 IST