టేకు చెట్టు రికవరీలో జాప్యమేల?
ABN , First Publish Date - 2021-06-20T05:50:44+05:30 IST
గోదావరిలో ఎగువ ప్రాంతాల నుంచి ఎంతో విలువైన చెట్లు కొట్టుకు వస్తుంటాయి.
ఉద్యోగిని రక్షించేందుకు రంగంలోకి నాయకులు?
నిడదవోలు, జూన్ 19: గోదావరిలో ఎగువ ప్రాంతాల నుంచి ఎంతో విలువైన చెట్లు కొట్టుకు వస్తుంటాయి. ఈ క్రమంలో ఈ నెల 1న పెండ్యాల గ్రామానికి గోదావరిలో ఎంతో ఖరీదు చేసే టేకు చెట్టు కొట్టుకు రాగా పెండ్యాల గ్రామస్థాయి అధికారి ఆ టేకు చెట్టును ప్రభుత్వానికి అప్పగించకుండా సొంత అవసరాల కోసం తరలించేసుకున్నారు. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో అప్రమత్తమైన అధికార్లు ఆ అధికారిపై చర్యలకు ఆదేశించారు. దీంతో నిడదవోలు మండల తహసీల్దార్ ఎం. గంగరాజు టేకు చెట్టు తరలింపుపై నివేదికను కొవ్వూరు ఆర్డీవోకు అంద జేశారు. అయితే ఈ రోజుకీ టేకు చెట్టును రికవరీ చేయక పోవడంపై గ్రామంలో వివాదం నడుస్తూనే ఉంది. అయితే అంత ఖరీదైన వృక్షాన్ని తరలించుకుపోయిన అధికారిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రాజకీయ నాయకులు రంగంలోకి దిగినట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. టేకుచెట్టు రికవరీపై తహసీల్దార్ గంగరాజును వివరణ కోరగా ఆర్డీవో నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు.