నాడు ఆదర్శం... నేడు దయనీయం

ABN , First Publish Date - 2021-06-14T05:46:55+05:30 IST

కుమారదేవం ఎత్తిపోతల పథకం కింద సుమారు వెయ్యి మంది రైతులు 2500 ఎకరాలు సాగు చేస్తున్నారు.

నాడు ఆదర్శం... నేడు దయనీయం
కుమారదేవం ఎత్తిపోతల పథకం వద్ద పేరుకున్న ఇసుకమేటలు

నిరుపయోగంగా కుమారదేవం ఎత్తిపోతల పథకం

మరమ్మతులకు గురైన మోటార్లు

నీరందించి ఆదుకోవాలంటున్న అన్నదాత

కొవ్వూరు మండలం కుమారదేవం ఎత్తిపోతల పథకం గత 45 సంవత్సరాలుగా పంట భూములకు నీరందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదర్శ ఎత్తిపోతల పథకంగా మూడు సార్లు ఎంపికైంది. శాసనసభా కమిటీ కుమారదేవం వచ్చి ఎత్తిపోతల పఽథకాన్ని సందర్శించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని మోడల్‌గా చూపింది. ఇప్పుడా  పథకం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం ప్రదర్శించడంతో నేడు చుక్క నీరు అందించలేని దయనీయ స్థితికి చేరుకుంది.

కొవ్వూరు, జూన్‌ 13:  కుమారదేవం ఎత్తిపోతల పథకం కింద సుమారు వెయ్యి మంది రైతులు 2500 ఎకరాలు సాగు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఎత్తిపోతల పథకం సమీపంలో గోదావరి నదిలో ఇసుక మేటలు వేసి సాగు భూములకు పూర్తి స్థాయిలో నీరందడంలేదు. తాత్కాలికంగా నదిలో కొంత ఇసుకను తొలగించి కాలువలు చేసి నీరందించిన పంపింగ్‌ స్కీం మోటార్లలో ఇసుక రేణువులు పడి మోటార్లు మరమ్మతులకు గురిఅవుతున్నాయి. పంపింగ్‌ స్కీం సమీపంలోని ఇసుక మేటలను తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేకుండా పోయిందని, దీంతో గత ఏడాది మూడు పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందించక పోవడంతో పంటలు ఎండిపోయాయని రైతులు వాపోయారు.  ప్రస్తుతం సార్వా పంటకు నారుమడులు వేసి దమ్ములు చేయాల్సిన సమయంలో చుక్కనీరు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పనిచేయని మోటార్లు

పంపింగ్‌ స్కీంలో 4 మోటార్లు పూర్తిగా మరమ్మత్తులకు గురయ్యాయి. ఒక్కొక్క మోటారు మరమ్మతుకు రెండున్నర నుంచి మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు పాలకవర్గం  ఆధ్వర్యంలో మరమ్మతులు చేపడుతూ వచ్చారు. ప్రతి ఏటా ఇసుక మేటలు తొలగించి కాలువలా తయారు చేసేందుకు సుమారు 2 లక్షల వరకు వెచ్చించేవారు. ప్రస్తుతం మోటార్లు పనిచేయకపోవడంతో నీరందించలేని స్థితికి చేరుకుంది. ఇసుక మేటలు తొలగించాలని, మోటార్లు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వానికి పాలకవర్గాలు ప్రతిపాదనలు అందించాయి. సార్వా సమీపిస్తున్నందున అధికారులు స్పందించి మోటార్లు మరమ్మతులు చేపట్టి సాగునీరు అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

తక్షణం రైతులకు నీరందించాలి : బీజేపీ

 కుమారదేవం ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం బీజేపీ నాయకులు సందర్శించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.    యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కరించి, సార్వాకు పూర్తి స్థాయిలో నీరందించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిక్కి నాగేంద్ర డిమాండ్‌ చేశారు.  బీజేపీ మండల అధ్యక్షుడు గన్నమని విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-14T05:46:55+05:30 IST