ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని వారం రోజులు పాటు తింటున్నారా?
ABN , First Publish Date - 2022-05-18T18:01:01+05:30 IST
మిగిలిపోయిన ఆహారం, కూరగాయలు, పండ్లు.. కావేవీ అనర్హం ఫ్రిజ్లో ఉంచటానికి. అయితే ఫ్రిజ్లో ఉంచిన ఆహారాన్ని తినొచ్చా?
ఆంధ్రజ్యోతి(18-05-2022)
మిగిలిపోయిన ఆహారం, కూరగాయలు, పండ్లు.. కావేవీ అనర్హం ఫ్రిజ్లో ఉంచటానికి. అయితే ఫ్రిజ్లో ఉంచిన ఆహారాన్ని తినొచ్చా?
ఫ్రిజ్లో ఉంచిన నీళ్లయినా, ఆహారమయినా ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ చల్లగా ఉండటం ఆరోగ్యానికి హానికరం. అన్నం, కూరలను ఒక రోజంతా ఫ్రిజ్లో ఉంచితే వాటిలో పోషక విలువలు నశిస్తాయి. కొందరు చట్నీ, పప్పు, చారు.. లాంటి ఆహార పదార్థాలను వారం రోజుల పాటు ఉంచుకుని తింటుంటారు. ఇరవై నాలుగు గంటల తర్వాత ఫ్రిజ్లో ఉంచిన ఆహారాన్ని తిన్నా.. తినకున్నా ఒకటే. పైగా వాటిపై బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. పైగా అలాంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల కడుపు వికారంగా ఉంటుంది. గ్యాస్ ఫామ్ అవుతుంది. కొందరికి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలకైతే వాంతులు, విరేచనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశమూ ఉంటుంది. అందుకే ఆహారాన్ని సరైన మోతాదులో వండాలి కానీ ఫ్రిజ్లో ఉంచుకోవటానికి వండుకోరాదు. తాజా ఆహారమే ఆరోగ్యకరం.
ఫ్రిజ్లో ఉంచిన ఆహారం రంగు, రుచి, వాసన కోల్పోతుంది. ఎండాకాలంలో చేసిన ఆహారం త్వరగా పాడైపోకుండా ఉండాలంటే మూడు లేదా నాలుగు గంటలు ఫ్రిజ్లో ఉంచినా సరిపోతుంది. ఫ్రిజ్ కిందిభాగంలో ఉడికించిన ఆహారం ఉంచుకోవాలి. కూరగాయలు ఫ్రిజ్లో ఉంచొచ్చు. పండ్లను, పండ్లరసాన్ని ఎప్పటికప్పుడు తాజాగా తీసుకోవాలి. అంతేకానీ ఫ్రిజ్లో ఉంచుకోరాదు. ప్రాసెస్డ్ ఫుడ్ను ఉంచుకోవచ్చు. మాంసం, చేపలను ఫ్రీజర్లో ఉంచుకోవాలి. ఆహారాన్ని సిల్వర్, ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచితే వాటి వాసనే వస్తుంది. అందుకే ప్రత్యేకంగా స్టోర్ చేసే కంటెయినర్స్ ఉంచుకోవాలి. మొత్తానికి ఫ్రిజ్లో నిలువ ఉంచిన ఆహారం కాకుండా, వేడి వేడి ఆహారాన్ని తినటానికే ప్రయత్నించాలి.