‘చెరువు తవ్వకాలను నిలిపివేయాలి’
ABN , First Publish Date - 2020-05-29T11:47:35+05:30 IST
గురజనాపల్లిలోని పంటపొలాలను ముగ్గురు వ్యక్తులు చెరువులుగా మార్చుతున్నారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ..
కరప, మే 28: గురజనాపల్లిలోని పంటపొలాలను ముగ్గురు వ్యక్తులు చెరువులుగా మార్చుతున్నారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు సరిహద్దు రైతులు గురువారం తహశీల్దార్ ఉదయభాస్కర్కు ఫిర్యాదుచేశారు. సర్వే నెంబర్ 199లో పలు ఎకరాల్లో మిషన్లతో చెరువుల తవ్వకం చేపట్టారని, దీంతో సరిహద్దు పొలాలన్నీ ఉప్పుకయ్యలుగా మారి భవిష్యత్లో పంటలు పండవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు తవ్వకాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించాలన్నారు.
తక్షణం రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనుమతులను రద్దుచేసి పనులను నిలిపివేయాలని కోరారు. అయితే చెరువుల తవ్వకానికి అనుమతులు లేవని, విచారించి చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ఆదేశాలతో ఆర్ఐ మాచరరావు, వీఆర్వో ఏసేబు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. ఇప్పటికే అక్కడ ఉన్న చెరువులకు నీరు పోయే మార్గాన్ని ఎక్స్కవేటర్తో తవ్వుతున్నారని, ఇది మినహా కొత్త చెరువులను తవ్వడంలేదని ఆర్ఐ విలేకరులకు వివరణ ఇచ్చారు.