పట్టించుకోవడం మానేశారు..!
ABN , First Publish Date - 2022-08-18T04:35:59+05:30 IST
పామూరు మండలంలోని పలు గామీణ ప్రాంత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వీటిపై ప్రయాణం అంటేనే వాహనదారులు బెంబేలెత్తున్నారు. నరకానికి నకళ్లుగా మారిన రోడ్లు కనీసం మరమ్మతులకు నోచుకోకపోవడంతో వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా తయారైంది.
మరమ్మతుల కోసం గోతులు తవ్వి వదిలేసిన రజాసాహేబ్పేట రోడ్డు
చప్టాలు కట్టి అనుసంధానం చేయని కరోళ్లపాడు గ్రామ రహదారి
పామూరు మండలానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.75 కోట్లు మంజూరు
వైసీపీ వచ్చాక వారికి ఆ నిధులతో అనుకూల ఊళ్లకే రోడ్లు
పామూరు, ఆగస్టు 17 : మండలంలోని పలు గామీణ ప్రాంత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వీటిపై ప్రయాణం అంటేనే వాహనదారులు బెంబేలెత్తున్నారు. నరకానికి నకళ్లుగా మారిన రోడ్లు కనీసం మరమ్మతులకు నోచుకోకపోవడంతో వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా తయారైంది.
గత ప్రభుత్వ హయాంలో 16 గ్రామీణ ప్రాంతాల రోడ్లు నిర్మాణం కోసం ఏపీఆర్ఆర్పీ గ్రాంటు కింద సుమారు రూ.75 కోట్లు మంజూరయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వారివి అ నుకూలంగా ఉన్న గ్రామాల్లోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. కంభాలదిన్నె పంచాయతీ పరిధిలోని రజాసాహేబ్పేట గ్రామానికి వెళ్లే రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మించేందుకు యంత్రాలతో గోతులు తవ్వి వదిలేయడంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. ద్విచక్రవాహనంపై, ఆటోలలో ప్రయాణించే సమయంలో గోతులకారణంగా అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో ఫెన్సింగ్ రాళ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ గోతుల్లో పడి పక్కకు ఒరిగింది. ఫెన్సింగ్ రాళ్లపై కూ ర్చుని ఉన్న ఇద్దరు కూలీలపై రాళ్లు పడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అధ్వానరోడ్డుతో నరకయాతన అనుభవిస్తున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. తూర్పుకట్టకిందపల్లి పంచాయతీ కరోళ్లపాడు గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు మంజూరుకాగా కాంట్రాక్టరు రోడ్డు వేసేందుకు అక్కడక్కడా చప్టాలు కట్టి రోడ్డును వేయకుండా వదిలివేయటం వలన గ్రామస్థులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.