పులిచింతల ప్రాజెక్టులో స్టాప్లాక్ ఏర్పాటు రేపటికి వాయిదా
ABN , First Publish Date - 2021-08-07T01:47:21+05:30 IST
పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిన చోట స్టాప్లాక్ ఏర్పాటు చేసే ప్రక్రియ
గుంటూరు: పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిన చోట స్టాప్లాక్ ఏర్పాటు చేసే ప్రక్రియ శనివారానికి వాయిదా పడింది. చీకటిపడడంతో పనులను నిపుణులు నిలిపివేసారు. శనివారం ఉదయం నుంచి స్టాప్లాక్ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి.
డాక్టర్ కేఎల్రావు సాగర్ పులిచింతల డ్యాం 16వ నెంబరు గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. గురువారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకొంది. రాత్రి 2 గంటలకు ప్రాజెక్టులోని 13, 14 గేట్ల ద్వారా నీరు విడుదల అయింది. 3 గంటల సమయంలో 15, 16 గేట్లు నాలుగడుగుల పైకెత్తి నీటిని విడుదల చేస్తున్న క్రమంలో 16వ గేటు ఇనుప తాళ్లు, గడ్డర్లు నీటి ఉధృతికి తెగి గేటు మొత్తం నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో భారీగా వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. సాయంత్రం ఐదు గంటల సమయానికే ఇంచుమించుగా 5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం గేటు కొట్టుకుపోయిన కారణంగా డ్యాంలో 30 టీఎంసీల వరకు నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉందని ఇరిగేషన్వర్గాలు చెబుతున్నాయి.
పులిచింతల డ్యాంలో క్రెస్టు లెవల్ 36.34 మీటర్లుగా ఉంది. ఆ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడు డ్యాంలో 3.61 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటాయి. గ్రాస్ స్టోరేజ్ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా లైవ్ స్టోరేజ్ సామర్థ్యం 36.23 టీఎంసీలు. వీటన్నింటి పరిగణనలోకి తీసుకొంటే క్రస్ట్ స్థాయికి నీటిమట్టం తగ్గితేనే స్టాప్లాగ్ గేట్లను అమర్చవచ్చు. ఇందుకోసం డ్యాంని ఖాళీ చేయాల్సిందే. శని, ఆదివారం నాటికి సాగర్ నుంచి అవుట్ఫ్లో పూర్తిగా తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా పులిచింతల నుంచి ఇప్పటికే డిశ్చార్జ్ని 5 లక్షల క్యూసెక్కులకు పెంచారు. అంతకు మించి డిశ్చార్జ్ పెంచొద్దని జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.