‘కృష్ణా’ ప్రాజెక్టులు నిలిపివేయండి
ABN , First Publish Date - 2020-06-06T09:48:16+05:30 IST
రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులన్నీ నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్ఎంబీ) ఆ రాష్ట్రాన్ని ఆదేశించింది. ఇవి కేంద్ర జలశక్తి ఆదేశాలని స్పష్టం చేసింది.
- తెలంగాణకు కేఆర్ఎంబీ నిర్దేశం
- ‘అపెక్స్’ ఆమోదించాకే ముందుకు
- ఇవి జలశక్తి శాఖ ఆదేశాలని స్పష్టీకరణ
అమరావతి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులన్నీ నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్ఎంబీ) ఆ రాష్ట్రాన్ని ఆదేశించింది. ఇవి కేంద్ర జలశక్తి ఆదేశాలని స్పష్టం చేసింది. వాటి డీపీఆర్లను కృష్ణా బోర్డు పరిశీలించాక.. జలశక్తి మంత్రి ఆధ్వర్యంలోని అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాకే ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొంది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతుల్లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని.. మరికొన్ని ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచుతోందని గత నెల 19వ తేదీన కేఆర్ఎంబీకి ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఎస్ఎల్బీసీ (ఏఎంఆర్పీ) సామర్థ్యాన్ని 30 టీఎంసీలను 40 టీఎంసీలకు.. కల్వకుర్తి-25 నుంచి 40 టీఎంసీలకు.. నెట్టెంపాడు సామర్థ్యాన్ని 22 నుంచి 25 టీఎంసీలకు పెంచుతోందని.. మొత్తంగా 105.40 టీఎంసీలకు ప్రాజెక్టులను విస్తరిస్తోందని పేర్కొంది. అదేవిధంగా 90 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, 30 టీఎంసీల సామర్థ్యంతో డిండి, 19.59 టీఎంసీలతో మిషన్ భగీరథ, 5.50 టీఎంసీలతో భక్తరామదాసు, 5.44 టీఎంసీలతో తుమ్మిళ్ల ఎత్తిపోతలను తెలంగాణ నిర్మిస్తోందని తెలిపింది. ఇవి కొత్త ప్రాజెక్టులేనని.. వీటికి కృష్ణా బోర్డు అనుమతి గానీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం గానీ లేదని తెలిపింది. ఈ ఫిర్యాదును బోర్డు కేంద్ర జలశక్తి శాఖకు నివేదించింది. ఫిర్యాదును పరిశీలించిన కేంద్రం.. తక్షణమే తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులను నిలిపివేయాల్సిందిగా ఆ రాష్ట్రాన్ని ఆదేశించాలని బోర్డుకు సూచించింది. ఆ మేరకు కేఆర్ఎంబీ ఆదేశాలు జారీచేసింది.