Petrol and Diesel Price : ప్రజలను మభ్యపెట్టొద్దు : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-05-22T20:15:10+05:30 IST

ప్రజలకు నిజమైన ఉపశమనం కావాలని, వారిని మభ్యపెట్టవద్దని

Petrol and Diesel Price : ప్రజలను మభ్యపెట్టొద్దు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ప్రజలకు నిజమైన ఉపశమనం కావాలని, వారిని మభ్యపెట్టవద్దని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హితవు పలికారు. పెట్రోలు, డీజిల్‌లపై సుంకాలను తగ్గించిన నేపథ్యంలో ఆయన ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో రానున్న రోజుల్లో చిన్న మొత్తాల్లో ఈ ధరలు పెరుగుతాయని జోస్యం చెప్పారు.  


పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గిస్తున్నామని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి సామాన్యులకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) శనివారం చెప్పిన సంగతి తెలిసిందే. పెట్రోలుపై ఎక్సయిజ్ సుంకాన్ని లీటరుకు రూ.8 చొప్పున, డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని లీటరుకు రూ.6 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు., రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం వల్ల ఇంధనం ధరలు పెరుగుతున్నాయని, ఆ ధరలకు కళ్ళెం వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించాలని నిర్ణయించిందని చెప్పారు.  పెట్రోలియం ఉత్పత్తులపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT)ని తగ్గించి, సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 2021 నవంబరులో కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినప్పటికీ సామాన్య ప్రజలకు ఆ మేరకు ఉపశమనం కల్పించని రాష్ట్రాలు కూడా ఈసారి ఈ ప్రయోజనాన్ని ప్రజలకు అందజేయాలని కోరారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఒక్కొక్క వంటగ్యాస్ సిలిండర్‌కు రూ.200 రాయితీని ప్రకటించారు. సంవత్సరంలో గరిష్ఠంగా 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ పథకం లబ్ధిదారులు దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మంది ఉన్నారు. 


ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, పెట్రోలు, డీజిల్ ధరల్లో తగ్గుదల కేవలం కంటి తుడుపు చర్య అని మండిపడ్డారు. 2020 మే 1న లీటరు పెట్రోలు ధర రూ.69.50 అని; 2022 మార్చి 1న రూ.95.40 అని; 2022 మే 1న రూ.105.40 అని; 2022 మే 22న రూ.96.70 అని తెలిపారు. ఇక ఇప్పుడు పెట్రోలు ధర రోజువారీ 80 పైసలు, 30 పైసలు మోతాదుల్లో వృద్ధి చెందుతుందని అనుకోవచ్చునన్నారు. ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడం ఆపాలన్నారు. రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం నుంచి నిజమైన ఉపశమనం పొందే హక్కు ప్రజలకు ఉందన్నారు. మార్చి-మే మధ్య కాలంలో పెరిగిన ధరలు కేంద్ర ప్రభుత్వం తాజాగా తగ్గించినదాని కన్నా ఎక్కువ అని చెప్పారు. 




Updated Date - 2022-05-22T20:15:10+05:30 IST