చోరీకి గురైన సుప్రసిద్ధ నటరాజ విగ్రహం తిరిగి భారత్‌కు

ABN , First Publish Date - 2021-10-30T20:42:55+05:30 IST

మన దేశంలో చోరీకి గురై, విదేశాలకు చేరిన 248 ప్రాచీన కళాఖండాలు

చోరీకి గురైన సుప్రసిద్ధ నటరాజ విగ్రహం తిరిగి భారత్‌కు

చెన్నై : మన దేశంలో చోరీకి గురై, విదేశాలకు చేరిన 248 ప్రాచీన కళాఖండాలు, విగ్రహాలను అమెరికా గురువారం తిరిగి ఇచ్చేసింది. వీటిలో 13 కళాకృతులు తమిళనాడులోని వివిధ దేవాలయాల నుంచి దొంగిలించినవే. తంజావూరు, పున్నైనల్లూర్ గ్రామంలోని దేవాలయం నుంచి చోరీకి గురైన 10వ శతాబ్దంనాటి కాంస్య నటరాజ విగ్రహం కూడా వీటిలో ఉంది. 


దొంగతనానికి గురైన కళాకృతులు, విగ్రహాలను స్వాధీనం చేసుకునేందుకు విస్తృత స్థాయి దర్యాప్తు జరిగింది. ఈ దర్యాప్తులో పెద్ద ఎత్తున కళాఖండాలు, విగ్రహాలను గుర్తించారు. న్యూయార్క్ నగరంలోని ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన కార్యక్రమంలో భారతీయ అధికారులకు ఈ కళాఖండాలను, విగ్రహాలను అమెరికా అధికారులు అప్పగించారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016లో అమెరికాలో పర్యటించారు. భారత్‌లో దొంగతనానికి గురైనవాటిలో 157 భారతీయ ప్రాచీన కళాఖండాలను తిరిగి భారత దేశానికి అప్పగిస్తామని అమెరికా అధికారులు హామీ ఇచ్చారు. గురువారం మరో 91 కళాకృతులను అదనంగా ఇచ్చారు. కల్నల్ మాథ్యూ బొగ్డనోసాండ్ ఆధ్వర్యంలోని న్యూయార్క్ సిటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్ అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితంగానే ఈ కళాకృతులు తిరిగి స్వదేశానికి వచ్చాయి. ఈ ఆఫీస్‌కు భారత సంతతికి చెందిన అనలిస్ట్, ఆర్ట్ ఎక్స్‌పర్ట్ అప్సర అయ్యర్ సాయమందించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కూడా ఈ దర్యాప్తులో పాలుపంచుకున్నారు. 


మన దేశానికి వచ్చిన కళాకృతుల్లో చాలా ముఖ్యమైనది నటరాజ విగ్రహం. ఇది 1971లో దొంగతనానికి గురైంది. ఇది న్యూయార్క్‌లోని ఆసియన్ సొసైటీ మ్యూజియంలో కనిపించింది. 


వివిధ దేశాల నుంచి కళాకృతులను దొంగిలించి, అమెరికా తీసుకెళ్ళిన వ్యక్తి సుభాశ్ కపూర్. ఈయనకు న్యూయార్క్ సిటీలోని ఆర్ట్స్ ఆఫ్ ది పాస్ట్ గ్యాలరీ ఉంది. ఈ గ్యాలరీలో అమెరికా హోమ్‌లాండ్ సెక్యూరిటీ సోదాలు చేసింది. 14 చోట్ల 2012 వరకు జరిగిన సోదాల్లో 2,622 కళాకృతులను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.850 కోట్ల పైమాటే. భారత దేశం, నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, కంబోడియా, పాకిస్థాన్, థాయ్‌లాండ్ దేశాల నుంచి దొంగిలించినవి వీటిలో అత్యధికంగా ఉన్నాయి. 


Updated Date - 2021-10-30T20:42:55+05:30 IST