స్టాక్.. కుదుపు
ABN , First Publish Date - 2021-11-27T05:22:24+05:30 IST
కొత్త వేరియంట్ ఫియర్ దెబ్బకు స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 1,687 పాయింట్లు పతనం కావడంతో జిల్లాలోని మదుపుదారులు సుమారు వంద కోట్ల వరకు నష్టపోయారు.
జిల్లా మదుపుదారుల నష్టం రూ.100 కోట్లు పైమాటే
నరసాపురం, నవంబరు 26 : కొత్త వేరియంట్ ఫియర్ దెబ్బకు స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 1,687 పాయింట్లు పతనం కావడంతో జిల్లాలోని మదుపుదారులు సుమారు వంద కోట్ల వరకు నష్టపోయారు. అన్ని రంగాల షేర్లు కుప్పకూలడంతో భారీ పతనం సంభవించింది నరసాపురం, పాలకొల్లు, భీమవ రం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఏలూరు, జంగారెడ్డిగూడెం ప్రాం తాల్లో స్టాక్ మార్కెట్కు సంబంధించి ఫ్రాంచైజీస్ ఉన్నాయి. అన్ని ట్రేడింగ్ సెంటర్ల లోనూ భారీగానే నష్టాలు నమోదయ్యాయి. గతేడాది కొవిడ్ మొదట విడతలో స్టాక్ మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసుకుంది. కొవిడ్ తరువాత బ్యాంకు వడ్డీలు తగ్గడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు మార్కెట్లో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు స్వీకరించారు. కొంత కాలంగా యూరప్, అమెరికా వంటి దేశాల్లో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాలు మార్కెట్ను వెంటాడుతూ వచ్చాయి. అక్టోబరు నుంచి సెన్సెక్స్ సూచీ పడుతూ వచ్చింది. దీనికి గురువారం దక్షిణా ఫ్రికాలో కొత్త వేరియంట్ జత కలిసింది. ఈ కారణంగా శుక్రవారం ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలడంతో ఆ ప్రభావం భారత్పైన పడింది.