‘స్టెరిలైట్’ విక్రయానికి వేదాంత నిర్ణయం
ABN , First Publish Date - 2022-06-21T15:20:31+05:30 IST
తూత్తుకుడి స్టెరిలైట్ కర్మాగారం విక్రయించనున్నట్లు వేదాంత సంస్థ ప్రకటించింది. కర్మాగారం కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు జూలై 4వ తేది సాయంత్రం 6
ప్యారీస్(చెన్నై), జూన్ 20: తూత్తుకుడి స్టెరిలైట్ కర్మాగారం విక్రయించనున్నట్లు వేదాంత సంస్థ ప్రకటించింది. కర్మాగారం కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు జూలై 4వ తేది సాయంత్రం 6 గంటల్లోగా దరఖాస్తు చేయాలని సంస్థ తెలిపింది. ప్రజా వ్యతిరేకం, ప్రభుత్వ ఉత్తర్వులతో స్టెరిలైట్ కర్మాగారం మూతపడడంతో వేదాంత సంస్థకు ఇబ్బందులు తలెత్తాయి. పర్యావరణానికి హాని కలిగిస్తుందని ఈ కర్మాగారాన్ని మూసివేస్తూ 2018లో రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కర్మాగారం నిర్వాహకులు దాఖలుచేసిన పిటిషన్ విచారించిన మద్రాసు హైకోర్టు తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించింది. దీంతో, వేదాంత సంస్థ సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ వేసింది. ఈ క్రమంలో, గత ఏడాది కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో, స్టెరిలైట్ కర్మాగారంలో గత ఏడాది ఏప్రిల్ 27 నుంచి జూలై 31వ తేది వరకు ఆక్సిజన్ ఉత్పత్తికి సుప్రీంకోర్టు అనుమతించింది. అనంతరం ఆక్సిజన్ ఉత్పత్తికి అనుమతులివ్వాలనే వేదాంత పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా, తూత్తుకుడి స్టెరిలైట్ కాపర్ కర్మాగారానికి వ్యతిరేకంగా 2018 మే 22న ఆందోళన చేపట్టిన వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.