కుమారుడిని చంపిన సవతి తల్లి.. ఎందుకిలా చేశావని ఆమెను అడిగితే..!
ABN , First Publish Date - 2022-05-23T17:26:45+05:30 IST
కుమారుడిని చంపిన సవతి తల్లి.. ఎందుకిలా చేశావని ఆమెను అడిగితే..!
- తొలుత భవనంపై నుంచి తోసేసి..
- రెండు వారాల తర్వాత గొంతు నులిమి..
హైదరాబాద్ సిటీ/బర్కత్పుర : తనకు అడ్డుగా ఉన్నాడనే కోపంతో కుమారుడిని (Son) సవతి తల్లి రెండు వారాల క్రితం భవనం నుంచి తోసేసింది. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటికొచ్చిన కుమారుడిని గొంతు నులిమి (Murder) చంపేసింది. కాచిగూడ పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాకలో ఉంటున్న భాస్కర్ ప్రైవేట్ ఉద్యోగి. అతడి కుమారుడు ఉజ్వల్ (7) రెండు వారాల క్రితం భవనంపై నుంచి కింద పడడంతో గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కాస్త కోలుకోవడంతో రెండు రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. సరిత (సవతి తల్లి) శనివారం భర్తకు ఫోన్ చేసి ఉజ్వల్ నిర్జీవంగా పడి ఉన్నాడని చెప్పింది.
ఇంటికి చేరుకున్న భాస్కర్ కుమారుడిని పరిశీలించగా, గొంతుపై కమిలిన చారలు కనిపించాయి. అనుమానం వచ్చి కాచిగూడ పోలీసులకు (Police) సమాచారం ఇచ్చాడు. పోలీసులు బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. బాలుడిని గొంతు నులిమి హతమార్చినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోలీసులు సవతి తల్లి సరితను ప్రశ్నించగా, ఉజ్వల్ను పథకం ప్రకారం హత్య చేసినట్లు ఒప్పుకుంది. రెండు వారాల క్రితం కూడా తానే భవనంపై నుంచి తోసేసినట్లు చెప్పింది. అయినా, బతకడంతో గొంతు నులిమి చంపినట్లు పేర్కొంది. మున్ముందు ఆమెకు పిల్లలు పుడితే భర్త వారిపై పూర్తి ప్రేమ చూపడనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆమెపై హత్య కేసు నమోదు చేశారు.