కొండెక్కిన కోడిమాంసం
ABN , First Publish Date - 2022-05-16T06:25:59+05:30 IST
కోడి ధరలు కొండెక్కుతున్నాయి. వారం రోజుల్లో చికెన్ ధర కిలోకు రూ.50 వరకు పెరిగింది. ఉత్పత్తి తగ్గడం.. డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
కిలో రూ.320 పలుకుతున్న స్కిన్సెల్ చికెన్ ధర
కోళ్ల ఫారాల్లో తగ్గిన ఉత్పత్తి
పెరిగిన డిమాండ్తో ధరలకు రెక్కలు
బోధన్ రూరల్, మే 15: కోడి ధరలు కొండెక్కుతున్నాయి. వారం రోజుల్లో చికెన్ ధర కిలోకు రూ.50 వరకు పెరిగింది. ఉత్పత్తి తగ్గడం.. డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో చాలా కోళ్లు చనిపోతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఆదివారం కిలో స్కిన్లెస్ చికెన్ ధర ఏకంగా రూ.320 పైనే పలికింది. దీంతో కేజీ కొనాలనుకున్న వారు వెనక్కితగ్గి అరకిలోతో సరిపెట్టుకున్నారు. ఎండాకాలంలో చికెన్ ధరలు కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో చికెన్ ధర ఆకాశాన్ని అంటుకుంటుంది. కాగా, వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల కోళ్ల పెంపకం తగ్గడం వల్లే కోళ్ల కొరత ఏర్పడి ధరలు పెరిగాయని, కోళ్ల దాణాకు ఉపయోగించే మొక్కజొన్న, సోయా ధరలు గణనీయంగా పెరగడంతో ఉత్పత్తి వ్యయం ఎక్కువైందని అందుకే కొత్తగా పిల్లలను పెంచడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
ఫ ధర విపరీతంగా పెరిగింది : దినేష్, బోధన్
చికెన్ ధర విపరీతంగా పెరగడంతో చికెన్ కొనలేకపోతున్నాం. ఆదివారం మాంసం తినాలనే కోరిక ఉన్నప్పటికీ కొనలేని పరిస్థితి నెలకొంది. నిత్యం ధరలు పెరుగుతుంటే చికెన్ ఎలా కొనేది.
ఫ కోడికూర తినేలా లేదు : నాగమణి, బోధన్
రోజురోజుకూ కోడి మాంసం ధర పెరుగుతుంటే కోడికూర ఎట్లా తినాలి. కోడి మాంసంతో పాటు అన్ని ధరలు పెరుగుతున్నాయి. ఆదివారం కౌసు తినాలంటే ధరలు భగ్గుమంటున్నాయి. పెంచిన ధరలు తగ్గించాలి.