స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళకి హక్కు లేదు: కార్మికులు
ABN , First Publish Date - 2021-12-08T19:55:32+05:30 IST
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేపట్టిన ఉద్యమం మూడు వందల రోజులకు చేరుకుంది.
విశాఖ: స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేపట్టిన ఉద్యమం మూడు వందల రోజులకు చేరుకుంది. గాజువాక సెంటర్లో కార్మికులు మహాధర్నా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఆస్తులను అమ్మే నైతిక హక్కు ప్రభుత్వాలకు లేదంటూ నినాదాలు చేశారు. కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ఎవరి ప్రయోజనం కోసమంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ ఉక్కు పరిరక్షణపై ఎంపీలు గళం వినిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
స్టీల్ప్లాంటు పరిరక్షణ ఉద్యమం మళ్లీ వేడెక్కుతోంది. వ్యూహాత్మక విక్రయం ద్వారా ప్లాంటును ప్రైవేటు సంస్థలు/వ్యక్తులకు అప్పగించి సొమ్ము చేసుకోవాలనుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియ సజావుగా సాగేలా లేదని ఒక్కో విభాగాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రణాళిక రచించింది. అందులో భాగంగా తొలుత కోక్ ఓవెన్ బ్యాటరీ విభాగంలో 3, 4 బ్యాటరీల నిర్వహణ బాధ్యతలను తీసుకునేందుకు ఆసక్తి గల సంస్థలు ముందుకు రావాలని ఈ నెల ఒకటో తేదీన ప్రకటన ఇచ్చింది. ఈ విషయాన్ని రెండు రోజులు ఆలస్యంగా గుర్తించిన కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 300 రోజులుగా దీక్షలు చేస్తుంటే పట్టించుకోకుండా దొడ్డిదారిన ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అంగీకరించేది లేదని, మరింత పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించాయి. ఈ మేరకు కార్మిక సంఘ నాయకులు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను కలిసి ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని, గట్టిగా నిలదీయాలని కోరాయి.