షిల్లాంగ్: కొత్తగా నిర్మించిన మేఘాలయ లెజిస్లేటివ్ అసెంబ్లీ (Meghalaya legislative Assembly)లోని కొంత భాగం శనివారం రాత్రి 12.30 గంటలకు కుప్పకూలింది. రూ.177.7 కోట్ల వ్యయంతో ఉత్తరప్రదేశ్కు చెందిన యూపీఎన్ఆర్ఎన్ఎన్ఎల్ ఈ నిర్మాణ పనులు జరపగా, భవనంలోని 70 టన్నుల స్టీల్ డోమ్ (Steel dome) కుప్పకూలినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అన్నారు. డిజైన్లో తప్పిదమే డోమ్ కుప్పకూలడానికి కారణం కావచ్చని భవన నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పీడబ్ల్యూడీ ఇంజనీర్ ఒకరు అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
''స్టీల్ డోమ్ బరువు బహుశా బీమ్స్ కూడా తట్టుకోలేనంత ఎక్కువగా ఉండి ఉండొచ్చు. ఫలితంగానే కట్టడం మొత్తం కిందకు క్రుంగిపోయింది'' అని పీడబ్ల్యూబీ ఇంజనీర్ రాన్సమ్ స్టుంగ తెలిపారు. శిథిలాలు తొలగించేందుకు రెండు వారాలు పడుతుందన్నారు. స్టీల్ డోమ్ కూలిపోయిన సమాచారం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న ఇంజనీర్లు... కొత్త డోమ్ నిర్మాణానికి కనీసం 8 నెలలు పడుతుందని తెలిపారు. కాగా, మొత్తం భవంతి డిజైన్ను ఐఐటీ రూర్కీ అధికారులు అప్రూవ్ చేసినట్టు అసెంబ్లీ అధికారులు తెలిపారు.