హోదా రాదు
ABN , First Publish Date - 2022-07-20T08:36:13+05:30 IST
హోదా రాదు
మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
అయినా... సీఎం జగన్ మౌనం
ఎన్నికల ముందు పులిలా గాండ్రింపు
అధికారంలోకి రాగానే ‘హ్యాండ్సప్’
25 మంది ఎంపీలను గెలిపించాలని..
హోదా తీసుకొస్తానని పదేపదే ప్రకటన
తననే నమ్మాలని ప్రజలకు పిలుపు
సీఎం కాగానే అంతే సంగతులు
తనతో అవసరమున్నప్పుడూ
గుర్తుకురాని ప్రత్యేక హోదా డిమాండ్
అడగక ముందే బీజేపీకి అన్నింటా మద్దతు
ప్రత్యేక హోదాపై కేంద్రం పాతపాటే పాడింది! హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఈ అంశంపై పార్లమెంటులో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. నిజానికి... ఈ అంశాన్ని జగన్ ఎప్పుడో ‘వదిలేశారు’! ఇప్పుడు కేంద్రం ‘నో’ అన్నా ఆయనది మౌనమే.
ఎన్నికల ముందు...
కాంగ్రె్సను నమ్మొద్దు. బీజేపీని నమ్మొద్దు. చంద్రబాబును, ఆయన పార్టనర్ను నమ్మొద్దు. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామంటారో, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్లకే మద్దతిస్తాం! మన ఎంపీలను మన దగ్గరే పెట్టుకుందాం! ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టు... పెట్టిన తర్వాతనే నీకు మద్దతిస్తాం అని చెబుతానని మీకు హామీ ఇస్తున్నా.
- 2018 నవంబరు 28న పాలకొండలో జరిగిన సభలో జగన్!
అధికారంలోకి వచ్చాక!
వాళ్లకు (బీజేపీకి) 250 సీట్లు దాటకూడదని దేవుడిని చాలా ప్రార్థించాను. ఏం చేద్దాం! మన ఖర్మ అనుకోవాలో ఏమో! మన అవసరం లేకుండానే వాళ్లు బలంగా ఉన్నారు. వాళ్లకు మనతో అవసరం లేదు కాబట్టి అడుగుతూ పోవడమే! ఈ ఐదేళ్లలో ప్రధానిని కలిసిన ప్రతిసారీ... ఆయన ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ అడుగుతూనే ఉంటా. ఎప్పుడో ఓసారి వస్తుంది!
- 2019 మే 27న ఢిల్లీలో మోదీని కలిసిన తర్వాత జగన్
‘అవసరానికి’ ఓ మాట..
‘కేంద్రానికి ఏదో ఒకరోజు మన అవసరం వస్తుంది. అప్పుడు... ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ అమలు చేస్తేనే మద్దతిస్తామని డిమాండ్ చేస్తాం. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని పదేపదే అడుగుతూనే ఉంటాం!’’
- రెండేళ్ల కిందట జరిగిన ఒక సదస్సులో సీఎం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై పులిలా గాండ్రింపులు! మెడలు వంచి మరీ సాధిస్తామంటూ సింహ గర్జనలు! అధికారంలోకి వచ్చిన తక్షణం... గాండ్రింపులు, గర్జనలు మాయమైపోయాయి! తాను అధికారంలోకి వచ్చేందుకు, అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబును ‘ఇరికించేందుకు’ ఉపయోగించుకున్న ప్రత్యేక హోదా... వైసీపీ అజెండా నుంచి ‘మాయమైపోయింది’! ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు’ అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టంగా తేల్చి చెప్పింది. అయినా సరే... జగన్ మారు మాట్లాడరు. అన్ని విషయాలలో అడగకుండానే బీజేపీకి మద్దతు ఇవ్వడం మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు. ప్రతిపక్షంలో ఉండగా ‘హోదా’పై పులివెందుల పులిలా రాష్ట్రవ్యాప్తంగా గాండ్రించిన జగన్.. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో భారీ విజయం సాధించి ‘తాడేపల్లి’కి చేరిన తర్వాత పిల్లిలా మారిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్రానిది అదే మాట....
రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకు ఐదు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టింది. కానీ... అధికారంలోకి రాగానే ఆ మాట పక్కనపెట్టింది. ఆర్థిక సంఘం సిఫారసుల పేరు చెప్పి హోదాకు సమానమైన ప్రయోజనాలతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. రాష్ట్ర విభజన కష్టాలు, విభజన హామీలు నెరవేర్చుకోవాల్సిన అవసరం, కేంద్ర సహకార ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి టీడీపీ సర్కారు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో సామరస్య ధోరణి ప్రదర్శించింది. కేంద్ర సంస్థల ఏర్పాటు, పోలవరం, అమరావతి రాజధాని, లోటు నిధుల వంటివి సాధించుకుంటూ వచ్చిం ది. అప్పుడు కూడా బీజేపీకి ఇతర పార్టీలతో అవసరం లేదు. సొంతంగానే మ్యాజిక్ మార్కును సాధించింది. అయితే అప్పుడు విపక్షంలో ఉన్న జగన్ ఊరూరా తిరుగుతూ ‘హోదా’ వాదన చేశారు. కేంద్రంతో ఎందుకు గొడవ పడటంలేదంటూ చంద్రబాబును నిలదీశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే... కేంద్రం మెడలు వంచి మరీ హోదా సాధిస్తామని పదేపదే ప్రకటించారు. చివరికి... చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఘర్షణకు దిగారు. టీడీపీ ఎంపీల చేత కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయించారు. ‘చంద్రబాబు వైసీపీ ట్రాప్లో పడ్డారు’ అని అప్పట్లో పార్లమెంటు వేదికగా మోదీ వ్యాఖ్యానించారు. ఒకవైపు చంద్రబాబు కేంద్రంతో పోరాడటం లేదంటూనే... జగన్ తాను మాత్రం బీజేపీకి అన్ని అంశాల్లో సహకరిస్తూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బీజేపీకి అవసరం ఎంతగానో ఉంది. అయినా సరే... హోదా గురించి అడగలేదు. పైగా... ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించకముందే, తానే ముందుగా మద్దతు ప్రకటించేశారు.
నాటి గర్జనలు ఎక్కడ?
హోదాపై చంద్రబాబు, నరేంద్రమోదీ, పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని మోసం చేశారంటూ ప్రతిపక్ష నేతగా 2019 ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నాలుగేళ్లుగా చంద్రబాబు సంసారం చేసినా హోదాను తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాపై చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేదన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన హామీలతో సహా .. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామంటూ బీజేపీ, టీడీపీ, జనసేన హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. ‘‘ఒకరు చేతులు పట్టుకుంటే.. మరొకరు చేతికి కత్తి ఇచ్చారు. చివరకు ఇంకొకరు కత్తితో గట్టిగా పొడిచేశారు’’ అని బాధపడ్డారు. హోదాను ఎన్నికల అస్త్రంగా మార్చేసి... మొత్తం 25 లోక్సభ స్థానాలనూ వైసీపీ గెలుచుకుంటే.. ప్రత్యేక హోదా ఇచ్చిన వారికే కేంద్రంలో మద్దతు ప్రకటిస్తామన్నారు. ఇదే కాదు! పాదయాత్రలో ప్రతిచోటా ‘హోదా’ పేరుతో యువతను రెచ్చగొట్టారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందన్నారు. ‘నన్ను నమ్మండి. ప్రత్యేక హోదా తీసుకొస్తా’ అన్నారు. చివరికి... ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే హోదాపై చేతులెత్తేశారు. బీజేపీకి 250కిపైగా స్థానాలు గెలుచుకోవడం మన ఖర్మ, మన ప్రార్థనలను దేవుడు ఆలకించలేదు... ఇలా వేదాంత ధోరణి ప్రదర్శించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి హోదాతో సహా విభజన హామీలను గుర్తు చేస్తూ నెరవేర్చాలంటూ అభ్యర్థించడం మినహా మరో గత్యంతరం లేదంటూ తేల్చేశారు.
సాగిల పడాల్సిందేనా?
‘బీజేపీకి మన అవసరంలేదు కాబట్టి... మనమేం చేయలేం. వాళ్ల దయ, మన ప్రాప్తం’ అంటూ జగన్ చేసిన కొత్త సిద్ధాంతంపై అప్పట్లోనే రాజకీయ వర్గాలు విస్తుపోయాయి. రాష్ట్ర హక్కులను సాధించడం కోసం ఎందుకు పోరాటం చేయకూడదనే ప్రశ్నకు జగన్ జవాబు చెప్పలేకపోయారు. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతోనూ కేంద్రానికి అవసరం లేదు. ఈ రెండు రాష్ట్రాలూ అవసరమైనప్పుడు కేంద్రంతో ఘర్షణ వైఖరినే అవలంబిస్తున్నాయి. ఘాటుగానే సమాధానం చెబుతున్నాయి. కేంద్రానికి ఎదురు తిరుగుతున్నాయి. కేవలం సీబీఐ కేసులకు భయపడే జగన్ కేంద్రం చెప్పుచేతల్లోకి వెళ్లిపోయారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు .. ఇతర ప్రయోజనాల విషయంలో సహకారం అందించకపోయినా.. జీ హుజూర్ అంటున్నారని మండిపడుతున్నారు. బహుశా... ఎన్నికల ముందు మరోసారి జగన్ ‘హోదా’ పాట పాడతారేమో! మరోసారి అధికారం అప్పగించి, పాతిక మంది ఎంపీలను గెలిపిస్తే... ‘ప్రత్యేక హోదా ఇచ్చిన వారికే కేంద్రంలో మద్దతు ప్రకటిస్తాం’ అని మరోసారి బురిడీ కొట్టిస్తారేమో!