లకారంలో కృష్ణావతార ఎన్టీఆర్ విగ్రహం
ABN , First Publish Date - 2022-01-21T05:54:43+05:30 IST
లకారంలో కృష్ణావతార ఎన్టీఆర్ విగ్రహం
మంత్రి పువ్వాడ చొరవతో 45అడుగుల ప్రతిమ ఏర్పాటు
మే 28న జూనియర్ ఎన్టీఆర్తో ఆవిష్కరణకు సన్నాహాలు
ఖమ్మం, జనవరి 20 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు భారీ వ్రిగ్రహాన్ని నెలకొల్పేందుకు ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్బండ్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో శ్రీకృష్ణావతారంలోని ఎన్టీఆర్ 45అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుండగా.. తానా మాజీ అధ్యక్షుడు జైశేఖర్ తాళ్లూరితో పాటు పసురా గ్రూప్, బత్తినేని బ్రదర్స్, మల్లాదివాసు, శ్రీచైతన్య విద్యాసంస్థలు, వీవీసీ గ్రూప్ వంకాయలపాటి సురేష్, కేఎల్సీ క్లబ్, పువ్వాడ ఫౌండేషన్తో పాటు పలువురు వ్యక్తులు, సంస్థలు సుమారు రూ.2.30కోట్ల సహకారం అందిస్తున్నాయి. తొలుత తెలుపురంగు మెటల్తో విగ్రహాన్ని తయారు చేసి ఆపై వివిధ రంగులు వాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతాప్వర్మ అనే చిత్రకారుడు ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. అయితే వచ్చే మే 28న ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ ట్యాంక్బండ్పై భారీ బుద్ధుడి విగ్రహాన్ని నాడు ఎన్టీఆర్ నెలకొల్పగా, ఇప్పుడు ఎన్టీఆర్ కృష్ణావతారంలోని భారీ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నెలకొల్పబోతున్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే తన దేవుళ్లని భావించి, కులమతాలకు అతీతంగా అన్నివర్గాల ఆరాధ్యదైవంగా వెలుగొందిన ఎన్టీఆర్కు ఖమ్మం లకారంలో తెలుగుజాతి పులకరించేలా జరిగే ఈ విగ్రహ ప్రతిష్ఠ కోసం లకారం ట్యాంక్బండ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.