నీట్ రాష్ట్ర ర్యాంకులు విడుదల
ABN , First Publish Date - 2021-11-24T14:21:36+05:30 IST
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో..
మొదటి ర్యాంకు సాధించిన విష్ణు వివేక్
2, 3 స్థానాల్లో రుషిల్, వెంకట కౌశిక్రెడ్డి
రాష్ట్రం నుంచి 39,388 మందికి అర్హత
అమరావతి(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2021 రాష్ట్ర స్థాయి ర్యాంకులను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించి ఈ నెల 1న విడుదలైన జాతీయ స్థాయి ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. వాటి ఆధారంగా వర్సిటీ అధికారులు ప్రస్తుతం స్టేట్ ర్యాంకులు విడుదల చేశారు. జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించిన చందం విష్ణు వివేక్ రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించారు. గొర్రిపాటి రుషిల్ (జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు) రెండో ర్యాంకు, పల్లి వెంకట కౌశిక్ రెడ్డి (జాతీయ స్థాయిలో 27వ ర్యాంకు) మూడో ర్యాంకు, కేతంరెడ్డి గోపీచంద్రెడ్డి (జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు) 4వ ర్యాంకు, టి.సత్యకేశవ్ (జాతీయ స్థాయిలో 41వ ర్యాంకు) 5వ ర్యాంకుల్లో నిలిచారు. రాష్ట్రం నుంచి మొత్తం 39,388 మంది విద్యార్థులు నీట్లో అర్హత సాధించారని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేయనున్నారు.