రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టు పాలన సాగుతోంది
ABN , First Publish Date - 2021-09-18T03:31:27+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీరు ఫ్యాక్షనిస్టు పరిపాలనను తలపిస్తోందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబరు 17: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీరు ఫ్యాక్షనిస్టు పరిపాలనను తలపిస్తోందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. శుక్రవారం బుచ్చిరెడ్డిపాళెంలోని టీడీపీ కార్యాలయంలో మండల స్థాయి నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ రాళ్లు, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో 14ఏళ్లు సీఎంగా పనిచేసిన ఏకైక సీనియర్ నాయకుడు చంద్రబాబునాయుడన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యే దుర్మార్గమైన ఆలోచనతో ఒక గూండాలా, ఉగ్రవాదిలాగా ప్రవర్తించిన తీరు దేశం తలదించుకునేలా చేసిందన్నారు. 18 కార్లలో వైసీపీ గూండాలతో వచ్చి చంద్రబాబు ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి చేస్తే పోలీసు యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహించడం విచారకరమన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, ఏ ఒక్క అధికారినీ వదలేది లేదని పోలీసు అధికారులకు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎంవీ.శేషయ్య, పార్లమెంటరీ అధికార ప్రతినిధి సీహెచ్. కృష్ణచైతన్య, టీడీపీ నాయకులు హరికృష్ణ, హరనాథ్, రామానాయుడు, మహేష్ నాయుడు, కోదండరామిరెడ్డి, బచ్చాబాయ్, బాలాకుమార్, విడవలూరు, కొడవలూరు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.