రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-09-27T06:44:29+05:30 IST
రాష్ట్ర స్థాయి ఏకలవ్య మోడల్ రెడిడెన్షియల్ పాఠశాలల క్రీడా పోటీల్లో విద్యార్థులు సత్తా చాటాలని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కొండలరావు పిలుపునిచ్చారు.
28 ఏకలవ్య మోడల్ రెడిడెన్షియల్ పాఠశాలల నుంచి విద్యార్థుల హాజరు
అరకులోయ, సెప్టెంబరు 26: రాష్ట్ర స్థాయి ఏకలవ్య మోడల్ రెడిడెన్షియల్ పాఠశాలల క్రీడా పోటీల్లో విద్యార్థులు సత్తా చాటాలని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కొండలరావు పిలుపునిచ్చారు. సోమవారం అరకులోయలోని క్రీడా పాఠశాల ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో విజయ పతాకం ఎగురవేయాలన్నారు. ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్.శ్యాంసుందర్ మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(నెస్ట్), మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్(మోటా) సంయుక్తంగా ఈ రాష్ట్ర స్థాయి ఏకలవ్య మోడల్ రెడిడెన్షియల్ పాఠశాల క్రీడా పోటీలు- 2022ను అరకులోయలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17 వ్యక్తిగత పోటీలు, ఏడు బృందాల వారీ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 ఏకలవ్య మోడల్ రెడిడెన్షియల్ పాఠశాల నుంచి సుమారు 700 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. వీరిలో 487 మందిని ఎంపిక చేసి జాతీయ పోటీలకు చక్కని శిక్షణ ఇస్తామన్నారు. ఈసారి జాతీయ స్థాయి పోటీలకు ఏపీ ఆతిథ్యమిస్తున్నదని తెలిపారు. అనంతరం ఆర్చరీ, హ్యాండ్బాల్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో మానెటరింగ్ ఆఫీసర్ రఘునాథ్, డీఈవో భారతీరత్నం, సీఐ జీడీ బాబు, పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు, పలు ఏకలవ్య పాఠశాలల ప్రిన్సిపాల్స్, పీడీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.